మహారాష్ట్రలోనే డబుల్ మ్యుటేషన్ వైరస్
అక్కడ 20 శాతం ప్రమాదకరంగా ఉన్నది
తెలంగాణలో ఈ వేరియంట్ 2 శాతంలోపే
తాజా జన్యు పరీక్షలకు నమూనాల సేకరణ
సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడి
రాష్ట్రంలో ఒక్క రోజే 70వేల టెస్టులు
ప్రత్యేక ప్రతినిధి, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ జన్యుక్రమాల్లో ప్రమాదకర మ్యుటేషన్లు లేవని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టంచేశారు. మహారాష్ట్రలో మాత్రం రెట్టింపు ఉత్పరివర్తన
(డబుల్ మ్యుటేషన్)లు ఉన్న ప్రమాదకర వైరస్ ప్రబలుతున్నట్టు వెల్లడించారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం.. ఇది మహారాష్ట్రలో 20 శాతంగా ఉన్నదని వివరించారు. అసలు డబుల్ మ్యుటేటెడ్ వైరస్ మహారాష్ట్రలోనే పుట్టిందా? అన్న కోణంలో పరిశీలన జరుగుతున్నదని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో మరోసారి జీనోమ్ సీక్వెన్సీ పరిశోధనలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా మహారాష్ట్రతోపాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి నమూనాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. రెండు వేరియంట్ల కలయికతో కొత్త స్ట్రెయిన్లు ఏర్పడటాన్ని వైరస్ రెట్టింపు ఉత్పరివర్తనంగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఎల్452ఆర్, ఈ 484క్యూ రెండు భిన్న వైరస్ రకాల కలయికతో కొత్త స్ట్రెయిన్ ఏర్పడిందని తాజా పరిశీలనలో తేలింది. కానీ ఈ రకం కొత్త వేరియంట్ ఇప్పటివరకు మహారాష్ట్రలోనే కనిపించిందని, మిగతాచోట్ల దీని ప్రభావం నామమాత్రమేనని రాకేశ్ మిశ్రా వివరించారు. తెలంగాణలో దీని ప్రభావం 2% మాత్రమే ఉండవచ్చన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో విస్తరిస్తున్న వేరియంట్ తక్కువ తీవ్రత కలిగిఉన్నదని స్పష్టంచేశారు. తెలంగాణలో మనుగడలో ఉన్న వైరస్ జన్యుక్రమాల్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ అవి వ్యతిరేక ఫలితాలు చూపేంత ప్రభావవంతంగా లేవని తేల్చారు. మహారాష్ట్రలో ప్రబలుతున్న డబుల్ మ్యుటేటెడ్ వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లను తట్టుకొని హాని కలుగచేస్తాయా? అన్న కోణంలో తాము పరిశోధన చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కరోనా కట్టడి చర్యలు కట్టుదిట్టం
సరిహద్దు రాష్ర్టాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. పెద్దసంఖ్యలో నమూనాలను పరీక్షిస్తూ వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నది. కొత్తగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటుచేస్తున్నది. జీహెచ్ఎంసీలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రాంతాలవారీగా పర్యవేక్షణ ఏర్పాటుచేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పలు జిల్లాల్లోనూ వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
ఆయా రాష్ర్టాల నుంచి వచ్చేవారిని సరిహద్దులోనే గుర్తించి ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వారంరోజులుగా నిత్యం 60 వేలకు పైగా నమూనాలను పరీక్షిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 70,280 పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్గా తేలినవారిని త్వరితగతిన గుర్తించడంతోపాటు వారితో సన్నిహితంగా ఉన్నవారికి ఎప్పటికప్పుడు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ప్రజలు మాస్క్ ధరించడం, భౌతికదూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా, సహకరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో వ్యాక్సిన్ తీసుకొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 700 పైగా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, ఈ సంఖ్యను మూడింతలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. గతంలో టీకాకు దూరంగా ఉన్న ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వారియర్లు వ్యాక్సిన్ తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు నిండి, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేనివారికి సైతం టీకా ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.