త్వరలో ఖరారు చేయనున్న కేంద్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను నీతి ఆయోగ్ త్వరలో ఖరారు చేయనున్నది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించి చర్చలు మొదలుపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించనున్నట్లు ఇటీవల బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. వీటిని ఎంపికచేసే బాధ్యతను నీతి ఆయోగ్కు అప్పగించింది. ఈ వ్యవహారానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇప్పటికే రెండు సమావేశాలను నిర్వహించిందని, తుది నిర్ణయానికి వచ్చే ముందు ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులతోపాటు రెగ్యులేటరీ సమస్యలు, హెచ్ఆర్ మేనేజ్మెంట్ లాంటి అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రైవేటీకరించే బ్యాంకుల పేర్లను నీతి ఆయోగ్ సిఫారసు చేసిన తర్వాత దానిపై కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి నేతృత్వంలోని సెక్రటరీల కోర్ గ్రూప్ (సీజీఎస్) పరిశీలన జరుపుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏర్పాటైన సీజీఎస్లో ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయ, కార్పొరేట్, న్యాయ వ్యవహారాలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల కార్యదర్శులతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) కార్యదర్శి ఇతర సభ్యులుగా ఉన్నారు. సీజీఎస్ అనుమతి తర్వాత ఆయా బ్యాంకుల తుది పేర్లను అనుమతి నిమిత్తం ఆల్టర్నేటివ్ మెకానిజం (ఏఎం)కు.. అక్కడి నుంచి ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్కు పంపుతారు.