డిమాండ్, నిర్మాణ వ్యయం పెరుగుతున్న
నేపథ్యంలో పరిశ్రమ సంకేతాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఇండ్ల ధరలు పెరుగవచ్చన్న సంకేతాలు నిర్మాణ రంగం నుంచి వస్తున్నాయి. మున్ముందు దేశీయ రెసిడెన్షియల్ మార్కెట్ వృద్ధిపథంలో దూసుకుపోగలదన్న అంచనా వేస్తున్న పరిశ్రమ నిపుణులు.. అటు డిమాండ్, ఇటు నిర్మాణ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఇండ్ల ధరలూ పరుగులు పెడుతాయని అంటున్నారు. వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ, రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ అనరాక్ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన వెబినార్లో పెద్ద ఎత్తున రియల్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. కరోనా తొలి, రెండో వేవ్ల అనంతరం ఇండ్ల అమ్మకాలు ఊహించని విధంగా పుంజుకున్నాయంటూ ఈ సందర్భంగా మెజార్టీ రియల్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొవిడ్ ఉద్ధృతిలో సేల్స్ దారుణంగా పడిపోయినా.. తిరిగి పూర్వ స్థితిని సంతరించుకోవడంపట్ల సంతోషాన్ని కనబరిచారు. ఈ క్రమంలోనే ఒబెరాయ్ రియల్టీ సీఎండీ వికాస్ ఒబెరాయ్ మాట్లాడుతూ నిర్మాణ వ్యయం భారంగా మారిందని కాబట్టి ఇండ్ల ధరల పెరుగుదల అనివార్యమన్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ సైతం ఇందుకు దారితీస్తున్నదని అభిప్రాయపడ్డారు. రాబోయే ఏడాది కాలం లో ఇండ్ల ధరలు 15 శాతం వరకు పెరుగుతాయని బెంగళూరుకు చెందిన శ్రీరామ్ ప్రాపర్టీస్ ఎండీ మురళీ సైతం వ్యాఖ్యానించారు.
రెడీ-టు-మూవ్కే మొగ్గు
ఇండ్ల కొనుగోలుకు అవకాశమున్న బయ్యర్లలో దాదాపు 80 శాతం మంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవో లేదా రెపోమాపో పూర్తయ్యే వాటినే ఎంచుకుంటున్నారని సీఐఐ-అనరాక్ సర్వేలో తేలింది. ఇక సుమారు 20 శాతం మంది మాత్రమే కొత్తగా ప్రారంభమైన ఫ్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ధర తర్వాత ఇండ్ల కొనుగోలుదారులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో డెవలపర్ల విశ్వసనీయత, ప్రాజెక్టు డిజైన్, ప్రాంతం ఉన్నాయి. ఈ ఏడాది జనవరి-జూన్లో జరిగిన ఈ సర్వేలో మొత్తం 4,965 మంది అభిప్రాయాలను సీఐఐ-అనరాక్ సేకరించింది. వీరిలో 32 శాతం మంది నిర్మాణం పూర్తయిన ఇండ్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. 6 నెలల్లో పూర్తయ్యే ఇండ్లపట్ల దాదాపు 24 శాతం మంది ఆసక్తి చూపగా, ఏడాది సమయం పట్టేవాటిని 23 శాతం మంది, కొత్త ప్రాజెక్టులను 21 శాతం మంది ఇష్టపడుతున్నట్లు తేలింది.
ధర కోటికి పైనే ఉండాలి
చౌక ధరల స్థిరాస్తులకు తొలిసారిగా డిమాండ్ తక్కువగా కనిపించిందని ఈ సందర్భంగా అనరాక్ తెలియజేసింది. తమ సర్వేలో రూ.45-90 లక్షలుండే ప్రాపర్టీల కొనుగోలుకు 35 శాతం మంది ఆసక్తి చూపారని, రూ.45 లక్షలకు దిగువన ఉండే ప్రాపర్టీలపట్ల 27 శాతం మందే ఇష్టం కనబర్చారని పేర్కొన్నది. గతేడాది ద్వితీయార్ధంలో వీరి సంఖ్య దాదాపు 36 శాతంగా ఉందని గుర్తుచేసిన అనరాక్.. గడిచిన ఏడాది కాలంలో దాదాపు 10 శాతం తగ్గిపోయారన్నది. ఇక 34 శాతానికిపైగా కొనుగోలుదారులు రూ.90 లక్షలు-రూ.2.5 కోట్ల విలువైన ఇండ్ల కోసం వెతుకుతున్నారని అనరాక్ చెప్పడం గమనార్హం.