మెల్బోర్న్: ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నూతనంగా తీసుకొస్తున్న ‘ది హండ్రెడ్’ టోర్నీకి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. జూలై, ఆగస్టు మధ్య జరిగే అవకాశమున్న లీగ్ నుంచి కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఒక్కొక్కరు వైదొలుగుతున్నారు. కొవిడ్-19 దృష్ట్యా ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టోయినిస్ లీగ్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఈసీబీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వార్నర్, స్టోయినిస్ లాంటి స్టార్ క్రికెటర్లు లీగ్కు దూరం కావడం ఒకింత నిరాశగా ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణ వలన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్ల ప్రాతినిధ్యం విషయంలో సందిగ్ధత కొనసాగుతున్నది. వార్నర్, స్టోయినిస్ స్థానంలో వేరే ప్లేయర్లను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది’ అని ఈసీబీ తెలిపింది. ఇదిలా ఉంటే కివీస్ క్రికెటర్ సోఫీ డివైన్, పాక్ పేసర్ షాహిన్ అఫ్రిదీ లీగ్ నుంచి దూరమయ్యే చాన్స్ కనిపిస్తున్నది.