ఇటీవలే పదివేల పరుగుల రికార్డును ఛేదించి ప్రపంచంలోనే ఆ ఘనతను సాధించిన మొదటి భారత మహిళా క్రికెటర్గా నిలిచింది మిథాలీ రాజ్. పదేండ్ల వయసులో తండ్రి కోరికతో క్రికెట్ బ్యాట్ పట్టిన మిథాలీకి అంతకుముందు క్రికెట్ అన్నా, ఇతర క్రీడలన్నా పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. సాధారణ అమ్మాయిల్లానే తనూ భరతనాట్యం నేర్చుకోవాలని భావించేదట. ఆ ఇష్టంతోనే ఎనిమిదేండ్లపాటు భరతనాట్యం సాధన చేయడమే కాకుండా, వేదికల మీద ప్రదర్శనలు కూడా ఇచ్చిందీ క్రికెట్ క్వీన్. క్రికెట్లో బిజీ అయినా తన అభిరుచిని వదలకుండా, ఖాళీ సమయాల్లో నాట్యసాధన చేసేది. క్రికెట్, భరత నాట్యంతోపాటు పుస్తకాలు చదవడమన్నా తనకు చాలా ఇష్టం. జీవితంలో అనుకున్నది సాధించడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని నమ్ముతుంది మిథాలీ. ఆత్మకథలు, తత్వశాస్త్రం, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది. లేడీ సచిన్గా భారతీయుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మిథాలీ భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలనందించింది. ఆమె స్ఫూర్తితో ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్ను కెరీర్గా ఎంచుకొని రాణిస్తున్నారు.