చెన్నై : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు ట్రైన్ల జాబితాను చైన్నైలోని సదరన్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, మాస్క్లు ధరించడం, సామాజిక దూరం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి భద్రతా నియమాలు పాటించాలని ప్రయాణికులను కోరింది. పునరుద్ధరించిన ట్రైన్లలో చెన్నై ఎగ్మోర్ – తంజావూర్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – తిరువనంతపురం, కోయంబత్తూర్ – నాగర్కోయిల్, పునలూర్ – మధురై ట్రైన్లు ఉన్నాయి. వాటిని ఈ నెల 20, 21 తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
మరో వైపు గోరఖ్పూర్ – ఎర్నాకుళం సెక్టార్లో సమ్మర్ రైళ్లను ప్రారంభిస్తున్నట్లు నార్త్ ఈస్టర్న్ రైల్వే ప్రకటించింది. సమ్మర్ స్పెషల్ రైలు 19, 26 (శనివారం) తేదీల్లో ఉదయం 8.30 గంటలకు గోరఖ్పూర్ నుంచి బయలుదేరి మూడో రోజు మధ్యాహ్నం 2.30గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుందని పేర్కొంది. తిరిగి 21, 28 (సోమవారం) తేదీల్లో రాత్రి 11.55 గంటలకు ఎర్నాకుళం నుంచి బయలుదేరి నాలుగో రోజు ఉదయం 6.30 గంటలకు గోరఖ్పూర్ చేరుకుంటుందని రైల్వేశాఖ పేర్కొంది. సిల్చార్ – కోయంబత్తూరు రూట్లో 22 నుంచి వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వివరించింది.