న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ పలు మోడల్ బైక్స్, స్కూటర్ల ధరలను తగ్గించి వేసింది. వివిధ వాహనాలపై గరిష్ఠంగా 33 శాతం మేర ధరలను తగ్గించింది. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం.. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఈవీ (ఫేమ్-2) పథకం కింద రాయితీలు పెంచిన సంగతి తెలిసిందే.
ఫేమ్-2 కింద కేంద్రం ప్రకటించిన ప్రయోజనాలను ఖాతాదారులకు బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హీరో ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. సింగిల్ బ్యాటరీ వేరియంట్పై కనిష్ఠంగా 12 శాతం, ఎన్వైఎక్స్ హెచ్ ఎక్స్ వంటి ట్రిపుల్ బ్యాటరీ వేరియంట్లపై 33 శాతం ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపింది.
దీని ప్రకారం ఫోటాన్ హెచ్ఎక్స్ మోడల్ రూ.71,449లకు వినియోగదారులకు లభిస్తుంది. లభించనుంది. గతంలో ఇది రూ.79,940లకు లభ్యమైంది. ఇక ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ ట్రిపుల్ బ్యాటరీ మోడల్ రూ.85,136లకు లభిస్తుంది. గతంలో దీన్ని రూ.1,13,115లకే విక్రయించింది.
ఓప్టిమా ఈఆర్ మోడల్ బైక్ ఇంతకుముందు రూ.78,640లకు విక్రయించగా, ఇక రూ. 58,980కి తగ్గిస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. విద్యుత్ వాహనాల వాడకానికి పెద్దపీట వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఐదేండ్లలో 50 నుంచి 70 లక్షల అమ్ముడు కావచ్చునని హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు.
ప్రస్తుతం విద్యుత్ వాహనాల కొనుగోలుపై ఫేమ్-2 కింద ఒక కేడబ్ల్యూహెచ్కు రూ.10వేల సబ్సిడీని రూ. 15 వేలకు పెంచి వేసింది. వాహనం ఖరీదులో 20 శాతమే అందించే సబ్సిడీని సైతం 40 శాతానికి పెంచింది.
దీంతో విద్యుత్ వాహనాల తయారీ సంస్థలు ఫేమ్-2 కింద వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. తదనుగుణంగా వాహన ధరలను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ఏథేర్, ఆంపియర్, టీవీఎస్ తదితర ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు ధరలను తగ్గించాయి.