వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్అలీముర్తుజా రిజ్వి
గద్వాల/అలంపూర్, జూన్ 4 : కరోనా వ్యాప్తిని అరికట్టి గ్రామాల్లో కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్అలీ ముర్తుజా రిజ్వి అధికారులను ఆదేశించారు.శుక్రవారం అలంపూర్ హరిత టూరిజం, కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతోపాటు, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి,అబ్రహాంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దుగా ఉన్నందున కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు, వైద్యులు సమావేశమై మొబైల్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలానికి టార్గెట్ నిర్ధేశించి కేసులు తగ్గేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తిరగకుండా ఐసొలేషన్ కేంద్రానికి తరలించాలని తెలిపారు. ధరూర్ మండలంలోని ఉప్పేర్ పీహెచ్సీ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నట్లు సమాచారం ఉందని, ఈనెల 9వ తేదీలోగా కేసులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇంటింటి జ్వరసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాగా, గద్వాల, అలంపూర్ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు, సిబ్బంది అవసరం ఉందని, వాటిని ఏర్పాటు చేయాలని జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, కలెక్టర్ శృతిఓఝా, ఎస్పీ రంజన్ రతన్కుమార్, అదనపు కలెక్టర్లు రఘురాంశర్మ, శ్రీహర్ష, డీఎంహెచ్వో చందునాయక్, దవాఖాన సూపరింటెండెంట్ శోభారాణి, అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మనోరమవెంకటేశ్, డాక్టర్ గంగాధర్, తాసిల్దార్ మధన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట, జూన్ 4 : జిల్లాలో కొవిడ్ నియంత్రణకు ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్అలీముర్తుజా రిజ్వి అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు, కలెక్టర్ హరిచందనతో కలిసి జిల్లాలో కొవిడ్ కేసుల పెరుగుదల, నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు కొవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలు, చేపట్టిన ఇంటింటి జ్వరసర్వే, కొవిడ్ పరీక్షల వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే కొవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలని, లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందుల కిట్ ఇవ్వడంతోపాటు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో డాక్టర్ కరుణాకర్, డాక్టర్ గంగాధర్, ఎస్పీ చేతన, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో జయచంద్రమోహన్, డీఎస్పీ మధుసూదన్రావు తదితరులు ఉన్నారు.