నాడు రాక్షసుల బాధ భరించలేక మహావిష్ణువు ఆదేశాలతో అమృతం పొందడానికి దేవతలు ‘క్షీర సాగర మథనం’ జరిపారు. కేసీఆర్ నేడు తెలంగాణలో రాక్షసుల సంహారం కోసం ‘సాగర మథనం’ జరపబోతున్నారు. అవును, నాగార్జునసాగర్లో శనివారం జరిగే ఉప ఎన్నికల సంగ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నది రాక్షస సంహారమే..
సాగర మథన సమయంలో కవ్వానికి త్రాడుగా ఉన్నందుకు తనకు వాటాగా ఇస్తానన్న అమృతం రాకపోయేసరికి వాసుకి ఏమీ చేయలేకపోతాడు. అమృత కలశం పెట్టిన చోటికి వెళ్లి అక్కడేమైనా అమృతం పడిందేమోనన్న ఆశతో దర్భలను నాలికతో రుచిచూస్తాడు. దీంతో వాసుకికి అమృతం దక్కకపోగా తన నాలుక రెండుగా చీలిపోతుంది. అప్పటినుంచి వాసుకి సంతానమైన సర్పాలూ రెండు నాలుకలతో జన్మిస్తాయి. ప్రతిపక్షాల రెండు నాలుకల ధోరణిని బట్టి వాటి నైజం బయటపడుతున్నది.
తెలంగాణ ఉద్యమం నుంచి నేటి ‘మిషన్ భగీరథ’ నీటి వరకు జానారెడ్డి మాట్లాడే మాటలు చూస్తుంటే వాసుకి సంతానమే గుర్తొస్తున్నది. కేసీఆర్కు ముఖ్యమంత్రి భిక్ష తాను పెట్టిందేనని చెప్పుకొంటున్న జానారెడ్డిది 40 ఏండ్ల రాజకీయ జీవితం. నాగార్జునసాగర్కు 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 17 ఏండ్ల పాటు పలు శాఖలకు మంత్రిగా అనుభవం ఉన్నది. ఏం లాభం? నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం. ఇక్కడి ప్రజలకు కనీసం మౌలికవసతులు కూడా కల్పించలేకపోయారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి కాలానుగుణమైనదే తప్పా ఆయన పట్టించుకొని, ప్రజల కోసం చేసినదేమీ లేదు. తను మంత్రిగా ఉన్నప్పుడూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంచి విద్యాసంస్థలే లేవు. ఉన్నది ఒక్కటే బీఈడీ కళాశాల. అదీ తాను రాజకీయాల్లో లేనప్పుడు, 1969లో ఏర్పాటైంది.
నాగార్జునసాగర్లో ఉన్నది ఒక్క కమలా నెహ్రూ దవాఖానే. 1960లలో నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఏదైనా అనారోగ్యం పాలైతే వారికి చికిత్స అందించడానికి నిర్మించినదే. నాడు జానారెడ్డి జాడ లేదు, పతా లేదు. అదేదో సినిమాలో మాటిమాటికి ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అని గొప్పలకు పోయినట్లే జానారెడ్డి కూడా తన రాజకీయ అనుభవాన్ని పదేపదే చెప్పుకొంటుంటేనవ్వొస్తున్నది. ఈ రాజకీయ అనుభవంలో తాను ఒక్క దవాఖాన నిర్మించిన దాఖలా లేదు.
నాగార్జునసాగర్లో ఉన్నది ఒక్క కమలా నెహ్రూ దవాఖానే. 1960లలో నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఏదైనా అనారోగ్యం పాలైతే వారికి చికిత్స అందించడానికి నిర్మించినదే. నాడు జానారెడ్డి జాడ లేదు, పతా లేదు. అదేదో సినిమాలో మాటిమాటికి ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అని గొప్పలకు పోయినట్లే జానారెడ్డి కూడా తన రాజకీయ అనుభవాన్ని పదేపదే చెప్పుకొంటుంటే నవ్వొస్తున్నది. ఈ రాజకీయ అనుభవంలో తాను ఒక్క దవాఖాన నిర్మించిన దాఖలా లేదు. సాగర్ ప్రజల సాగు నీటికేమో కానీ తాగు నీటి కోసం కూడా కొట్లాడింది లేదు. ఢిల్లీ పెద్దలకు గులాంగిరీ చేస్తూ మంత్రి పదవిని కాపాడుకోవడానికే తనకు నలభై ఏండ్లు సరిపోలేదు. ఇక ప్రజల బాగోగులు పట్టించుకోవడానికి సమయం ఎక్కడిది?
ఉమ్మడి నల్లగొండ జిల్లాను పరాయి పాలకుల దగ్గర తాకట్టుపెట్టిన జానారెడ్డి డిండి ప్రాజెక్టు గురించి నోరు విప్పలేదు. నెల్లికల్లు ప్రాజెక్టు ఆయనకు గుర్తే లేదు. సాగు, తాగు నీరు లేక నల్గొండ జిల్లా ప్రజల నోరెండుకపోయింది. నదీ జలాలు లేక బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తే నల్గొండ జిల్లా రైతులకు మిగిలింది అప్పే. వీటంతటికి జానారెడ్డి బాధ్యుడు కాదని నల్గొండ జిల్లాలోని ఏ ఒక్క వ్యక్తి చెప్పలేడంటే అతిశయోక్తి కాదు. ఫ్లోరైడ్ నీళ్లు తాగిన నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యం పాడైంది. బొక్కలు వంకరపోయి మంచానికే పరిమితమైన జీవితాలెన్నో.. వీళ్ల గోస వెనుక ఉన్నది జానారెడ్డి స్వార్థం కాదా?
అభివృద్ధి నాతోనే జరిగిందంటూ గొప్పలకు పోయే జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కనీసం ఒక్క డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారు. విద్యారంగంలో సాగర్ నియోజకవర్గం వెనుకపడ్డది. విద్యారంగంలో వెనుకబాటుతనాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ మొన్నటి హాలియా సభలో ‘భగత్ గెలిస్తే మీ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ వస్తద’నడంతో అక్కడి విద్యార్థులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. జానారెడ్డి హయాంలో పేద, లంబాడి ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోయేటియి. ఏ చిన్న రోగమో, నొప్పో వచ్చినా అయితే మిర్యాలగూడ, లేకుంటే నల్లగొండకు పోవాల్సిందే. కనీసం గ్రామాలకు సరైన రోడ్లు కూడా లేవు. నియోజకవర్గంలో ఏకఛత్రాదిపత్యం వహిస్తూ కొత్త నాయకత్వానికి అవకాశం రాకుండా చేసిన వ్యక్తి జానారెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లే అవుతున్నది. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా చేసింది రెండేండ్లే. అయితేనేం? సాగర్ నియోజకవర్గంలో డబ్భు ఏండ్ల వెనుకబాటుతనం, 35 ఏండ్ల నిర్లక్ష్యం కనుమరుగైంది. అభివృద్ధి జోడెడ్లు కట్టుకొని పరిగెడుతున్నది. 24 లక్షల వ్యయంతో కమలా నెహ్రూ దవాఖాన ఆధునికీకరణకు నోచుకున్నది. రూ.3 కోట్లతో పాలిటెక్నిక్ భవనం ఏర్పాటైంది. రూ.2 కోట్ల వ్యయంతో 3311 కేవీ సామర్థ్యం కలిగిన సబ్స్టేషన్ నిర్మించబడింది. రూ.18 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణమైంది. సాగర్ను మున్సిపాలిటీగా తీర్చిదిద్దారు.
యాసంగిలో 97,399 రైతన్నలకు రైతుబంధు ద్వారా సుమారు రూ.128 కోట్ల పెట్టుబడి సాయం అందింది. రూ.4 కోట్ల 11 లక్షలతో 3,495 మందికి కేసీఆర్ కిట్లు అందాయి, ప్రతి నెల వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, నేత, గీత కార్మికులకు ఆసరా పింఛన్ల ద్వారా సాయమందుతున్నది. ఏ ఊరికి పోయినా ప్రకృతి వనాలు దర్శనమిస్తున్నయి. ట్రాక్టర్లు, ట్రాలీలు, వైకుంఠ ధామాల ఏర్పాటుతో పల్లె ప్రగతికి బ్రహ్మరథం పడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవన్నీ చూశాక ఏడుసార్లు గెలిచి ప్రజా సంక్షేమం పట్టని జానారెడ్డి వైపే ప్రజలు ఉంటారనుకోవడం కాంగ్రెస్ నాయకుల అత్యాశే. అక్కడి ప్రజలు కోరుకుంటున్నది యువ నాయకత్వం. అందుకే నాగార్జునసాగర్ ప్రజలు పట్టం కట్టేది మహావిష్ణువు అయిన కేసీఆర్కే, పట్టాభిషేకం జరిగేది భగత్కే. ఈ క్షీర సాగర మథనంలో అమృతం దక్కేది సాగర్ ప్రజలకే.
(వ్యాసకర్త: ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడు)