యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
పది రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించాలి
సింగరేణి ఏరియా దవాఖానల్లో కొరత లేకుండా చూడాలి
అందుకు తగిన చర్యలు తీసుకోవాలి
జీఎంలకు సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
గోదావరిఖని, మే 4: కొవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో సింగరేణి ఏరియా దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రామగుండం సింగరేణి ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ను 10 రోజుల్లో అందుబాటులోకి తేవాలని డైరెక్టర్ ఫైనాన్స్ బలరాంను ఆదేశించారు. ఇది ప్రారంభమయ్యేలోగా పాల్వంచ, ఇతర పట్టణాల్లోని కేంద్రాల నుంచి ఆక్సిజన్ కొనుగోలుకు ఏర్పాటు చేయాలని డైరెక్టర్లకు సూచించారు. సంస్థలో పనిచేసే ఫేస్ ఉద్యోగులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తూ వెంటనే వ్యాక్సిన్ ఇప్పించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ఏరియా జనరల్ మేనేజర్ ప్రతి రోజు కనీసం గంట సేపు కరోనా పరిస్థితులపై సమీక్షించాలని ఆదేశించారు. దవాఖానలు, క్వారంటైన్ సెంటర్లలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అవసరానికి తగ్గట్టు డాక్టర్లు, సిబ్బందినీ నియమించుకోవాలని, ఖర్చుకు వెనుకాడవద్దని కోరారు.