న్యూఢిల్లీ, జూలై 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,214 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,925 కోట్ల లాభంతో పోలిస్తే 9.9 శాతం అధికమని కంపెనీ పేర్కొంది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12.5 శాతం అధికమై రూ.20,068 కోట్లు ఆర్జించింది. ఆర్థిక ఫలితాల సందర్భంగా సోమవారం సమావేశమైన కంపెనీ బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిషేరుకు రూ.6 మధ్యంతర డివిడెండ్ను ప్రతిపాదించింది.
ఈ నెల 28న వాటాదారులకు డివిడెండ్ చెల్లింపులు జరుపనున్నట్లు ప్రకటించింది. గత త్రైమాసికంలో కొత్తగా 7,500 మంది సిబ్బందిని నియమించుకోవడంతో మొత్తం సంఖ్య 1,76,499కి చేరుకున్నారు.
22 వేల ఉద్యోగాలు…
నిరుద్యోగులకు హెచ్సీఎల్ టెక్నాలజీ శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20-22 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతేడాది నియమించుకున్నవారితో పోలిస్తే 50 శాతం అధికం కావడం గమనార్హం. అలాగే జూలై 1 నుంచి అమలులోకి వచ్చేలా సిబ్బంది వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది కూడా.
తప్పుకున్న శివ్ నాడర్
హెచ్సీఎల్ టెక్నాలజీ యాజమాన్యంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సంస్థను ప్రారంభించిన శివ్ నాడర్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ కంపెనీ గౌరవ చైర్మన్గాను, బోర్డు సలహాదారుడిగా కొనసాగనున్నారు.
1976లో ఏడుగురుతో కలిసి హెచ్సీఎల్ టెక్నాలజీని ప్రారంభించిన శివ్ నాడర్కు 76 ఏండ్లు. కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్న సీ విజయకుమార్ నాడర్ స్థానాన్ని భర్తిచేయనున్నారు. ఆయన ఈ పదవిలో ఐదేండ్లపాటు కొనసాగనున్నారు. గతేడాది నాడర్ కుమార్తే రోష్ని నాడర్ చైర్పర్సన్గా నియమితులైన విషయం తెలిసిందే.