ముంబై: రిలయన్స్-ఫ్యూచర్ డీల్పై ఫ్యూచర్ ఏజీఎం ఆమోదానికి అనుమతించాలని రిలయన్స్ రిటైల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన నేషనల్ కంపెనీ ల్యా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తీర్పు రిజర్వు చేసింది. రిలయన్స్ రిటైల్లో విలీనానికి రూ.24,713 కోట్లకు విక్రయించడానికి ఫ్యూచర్ రిటైల్ కుదుర్చుకున్న ఒప్పందంపై బ్యాంకర్ల వైఖరేమిటని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ప్రశ్నించింది.
రిలయన్స్-ఫ్యూచర్ డీల్ పట్ల బ్యాంకర్లు విశ్వాసంతో ఉన్నారని రిలయన్స్ రిటైల్ న్యాయవాది జనక్ ద్వార్కదాస్ చెప్పారు. రిలయన్స్లో విలీనానికి ఆమోదం కోరుతూ ఫ్యూచర్ రిటైల్ నిర్వహించ తలపెట్టిన వాటాదారుల సమావేశం ఆగస్టు మూడో తేదీన జరుగాల్సి ఉంది.
అయితే, రిలయన్స్లో ఫ్యూచర్ రిటైల్ విలీనాన్ని గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యతిరేకిస్తున్నది. ఇంతకు ముందే ఫ్యూచర్ రిటైల్ అనుబంధ ఫ్యూచర్ కూపన్స్లో రూ.1500 కోట్ల విలువైన 49 శాతం వాటాలను అమెజాన్ కొనుగోలు చేయడమే దీనికి కారణం.
ఒకవేళ చట్టాలు అనుమతి ఇస్తే, మూడేండ్ల నుంచి 10 ఏండ్ల మధ్య ఫ్యూచర్ రిటైల్ ఆస్తులను అమెజాన్కు మాత్రమే విక్రయించే హక్కు కల్పిస్తూ రెండు సంస్థల మధ్య 2019 ఆగస్టులో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థల్లో ఒకటైన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 2019 నవంబర్లో ఆమోదముద్ర వేసింది కూడా.
ఈ నేపథ్యంలోనే ఫ్యూచర్-రిలయన్స్ డీల్పై అమెజాన్ న్యాయపోరాటం సాగిస్తున్నది. ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతున్నది.
రిలయన్స్ రిటైల్లో తమ సంస్థ విలీనాన్ని అడ్డుకోవద్దంటూ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు ఫ్యూచర్ గ్రూప్ ఉద్యోగులు గతంలో బహిరంగ లేఖ కూడా రాశారు.