న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేతో ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వారు ప్రధానంగా చర్చించారు. అంశాల వారీగా వివిధ పరిణామాలపై మాట్లాడుకున్నారు. ద్వైపాక్షి అంశాలపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై కూడా వారిద్దరూ చర్చ జరిపారు. వివిధ కూటముల్లో తమ దేశాల పాత్ర గురించి ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. ఈ వివరాలను భారత ప్రధానమంత్రి కార్యాలయం మీడియాకు వెల్లడించింది.
అదేవిధంగా కరోనా మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాలకు చెందిన సంబంధిత అధికారులు నిరంతరం పరస్పర సంబంధాలు కొనసాగించేలా వీలుకల్పించాలని ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే నిర్ణయించారు. ఈ సందర్భంగా భారత్కు శ్రీలంక ఎంతో ముఖ్యమైన పొరుగుదేశమని ప్రధాని పేర్కొన్నారు.