హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.75 వేల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వాటా కింద రూ.2,155.25 కోట్లు రానున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ర్టాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 28న జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ చట్టం కింద కేంద్రమే లోటును భర్తీ చేయాలని రాష్ర్టాలు కోరాయి. దీంతో ఆరు విడుతలుగా ప్రతి రెండు నెలలకు ఓసారి ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు విడుతలకు సంబంధించిన రూ.75 వేల కోట్లను విడుదల చేసింది.