Nirmala no GST for Petrol | జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొచ్చే అంశంపై కేంద్రం మరోమారు వెనుకడుగు వేసింది. పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి ఇది సరైన టైం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ భేటీలో జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకొచ్చే విషయం చర్చకు వచ్చిందని తర్వాత మీడియాకు నిర్మలా సీతారామన్ చెప్పారు.
పలు రాష్ట్రాలు జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావాలని కోరుకోవడం లేదని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిపై కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును చర్చిస్తుందన్నారు. ప్రాణాధార ఔషధాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, వాటిపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ పరిధిలోకి రాని జోల్గ్న్గెల్స్మా, విల్టెప్సోలపై జీఎస్టీ మినహాయించడంతో రూ.16లకు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఈ జీఎస్టీ సమావేశానికి ఏడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భౌతికంగా హాజరయ్యారు. నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ సమావేశానికి రాష్ట్రాల మంత్రులు భౌతికంగా హాజరు కావడం రెండేండ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇంతకుముందు 2019 డిసెంబర్ 18న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భౌతికంగా పాల్గొన్నారు.