భాగ్యనగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన పై వంతెనను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 1.13 కిలోమీటర్ల దూరం.. 24 మీటర్ల వెడల్పుతో రూ. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్ సైతం ఏర్పాటు చేశారు. వాటిలో చక్కటి పూల మొక్కలు నాటారు. ఎల్ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాదు.. ఈ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్-కూకట్పల్లి-అమీర్పేట-జీడిమెట్ల వైపునకు రాకపోకలు సాగించే వారికి వెసులుబాటు కలుగుతుంది. కాగా, బాలానగర్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. డ్రోన్ కెమెరాలతో తీసిన చిత్రాలను పోస్టు చేశారు. అధికారులను అభినందించారు.
బాలానగర్, జూలై 5: ఎట్టకేలకు బాలానగర్ వాసుల కల నెరవేరింది. సమైక్య రాష్ట్రంలో ఒక్క అడుగు ముందుకు పడని బాలానగర్ ఫ్లై ఓవర్ పనులను అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నారు. బాలానగర్ పారిశ్రామికవాడలో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా శ్రమించారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు అక్కడ ఫ్లై ఓవర్ను నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ రూ.387 కోట్ల నిధులు కేటాయించారు. ఈ క్రమంలో 2017 ఆగస్టు 21న మంత్రి కేటీఆర్ ఈ ఫ్లై ఓవర్ పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా బాలానగర్, ఫతేనగర్ డివిజన్లను అనుసంధానిస్తూ నిర్మాణ పనులు మొదలు పెట్టిన అధికారులు మూడు సంవత్సరాల 11 నెలల్లోనే పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ఆనాడు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన కృషితో నేడు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి అయ్యిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాలానగర్, ఫతేనగర్ ప్రాంత ప్రజలు నన్ను రెండుసార్లు ఆశీర్వదించారు. వారి సమస్యలను తీర్చేందుకు నా వంతు కృషి చేస్తున్నా. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు బాలానగర్లో ఫ్లై ఓవర్ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి నివేదించా. నా విన్నపాన్ని సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో అంగీకరించారు. వెంటనే నిధులు విడుదల చేశారు. నిర్ణీత గడువులోగా ఫ్లై ఓవర్ పనులు పూర్తి అయ్యాయి. మంగళవారం పురపాలక శాఖ మంత్రి ప్రారంభిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ ఫ్లై ఓవర్ కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. గత పాలకులు పట్టించుకోకపోయినా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ నిర్మాణ పనులను పూర్తి చేయించారు. తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి కేటీఆర్ కూడా అదే స్థాయిలో విశ్వనగరానికి బాటలు వేస్తున్నారు. దశాబ్దాల కాలం నాటి సమస్యకు పరిష్కారం దొరకడం సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలు అండగా నిలుస్తారు. -ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్