ముంబై, సెప్టెంబర్ 6: తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. విమానయాన పరిశ్రమకు కొత్త ఊపిరిలూదుతున్నాయి. దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరుగుతున్నది. ఆగస్టులోనూ 31 శాతం వృద్ధితో 66 లక్షలకుపైగా ప్రయాణీకులు విమానాల్లో ఎక్కినట్లు క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా సోమవారం తెలిపింది. అంతకుముందు నెల జూలైలో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 51 లక్షలుగా ఉన్నది. అయితే గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది దాదాపు 131 శాతం రద్దీ పెరుగడం గమనార్హం. నిరుడు ఆగస్టులో ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ 28.3 లక్షలుగానే ఉన్నది. ‘విమాన ప్రయాణాలకు డిమాండ్ క్రమేణా పెరుగుతున్నది. గత నెల ఆగస్టులో దాదాపు 30-31 శాతం ఎగిసి సుమారు 65-66 లక్షలుగా ప్రయాణీకులు నమోదయ్యారు. జూలైలో 50.1 లక్షలుగానే ఉన్నారు. ఇక నిరుడు ఆగస్టుతో పోల్చితే ఏకంగా 131 శాతం వృద్ధి కనిపించింది’ అని ఇక్రా కార్పొరేట్ ఉపాధ్యక్షుడు కింజల్ షా అన్నారు.
75.2 శాతం కెపాసిటీ..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి విమానాల్లో ప్రయాణీకుల సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం 75.2 శాతానికి పెంచింది. దేశవ్యాప్త లాక్డౌన్ అనంతరం నిరుడు మే 25న 33 శాతాన్ని అనుమతించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. డిసెంబర్ 3 నుంచి 80 శాతానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా జూన్ 1న 50 శాతానికి తగ్గించింది. వైరస్ తీవ్రత పడిపోతున్న క్రమంలో తిరిగి జూలై 5న 65 శాతానికి పెంచింది. అలాగే విమాన చార్జీలనూ కనీసం 10 శాతం, గరిష్ఠంగా 13 శాతం పెంచారు.
పూర్వ స్థాయికి తెస్తాం: సింధియా
ఎయిర్ ట్రాఫిక్ను కరోనా వైరస్ పూర్వ స్థాయికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా నిలిచిపోయిన దేశ, విదేశీ విమాన సర్వీసులను వీలైనంత వేగంగా పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. సోమవారం ఇండోర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విమాన సర్వీసులు, ప్రయాణీకుల్లో క్రమేణా వృద్ధి కనిపిస్తున్నదన్నారు.
57,500 ఈ ఆగస్టులో నడిచిన విమానాలు
28,834 గతేడాది ఆగస్టులో నడిచిన విమానాలు
1,900 గత నెలలో రోజుకు సుమారు నడిచిన విమానాలు
114 ఒక్కో విమానంలో సగటున ప్రయాణీకులు
బిజినెస్ ట్రావెల్కు ఆయా రాష్ర్టాల్లోని కొవిడ్ ఆంక్షల సెగ