పెద్దపల్లి జంక్షన్, ఏప్రిల్ 6: జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణపై మంగళవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మరోసారి కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సీఎస్ సూచించారని తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రతి పీహెచ్సీలో కనీసం 100 టెస్టులు, సీహెచ్సీలో 150 టెస్టులు, సివిల్ ఆస్పత్రిలో 300 టెస్టులు చేసి ఫలితాలను ఎప్పటికప్పుడు కొవిడ్ యాప్లో నమోదు చేయాలని చెప్పారు. 45 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలన్నారు.
ఇందుకు ప్రతి పీహెచ్సీ పరిధిలో 125, సీహెచ్సీ పరిధిలో 250, సివిల్ ఆస్పత్రి పరిధిలో 300 మందికి ప్రతిరోజూ కొవిడ్ వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. ఈనెలాఖరు దాకా సామూహిక కార్యక్రమాలు, సభలకు అనుమతి ఇవ్వవద్దన్నారు. బహిరంగా ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగే వారికి జరిమానా విధించాలని సీఎస్ ఆదేశించారని కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.