Tax Receipts | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్ పన్ను వసూళ్లు 53.50 శాతం పెరిగి రూ.4.60 లక్షల కోట్లకు చేరాయి. తద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా అడుగులేస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ఈ నెల 16 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లకు చేరాయి. అదే 2020-21లో రూ.5.88 లక్షల కోట్లకు పరిమితం అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 60.8 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి, ద్వితీయ, తృతీయ త్రైమాసికాల్లో అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు రూ.4,59,917.1 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే రోజుకు రూ.2,99,620.5 కోట్లు మాత్రమే. దీంతో ఈ ఏడాది 53.5 శాతం గ్రోత్ నమోదైంది. 2019-20తో పోలిస్తే 44.21 శాతం పురోగతి నమోదైంది. 2019-20లో అడ్వాన్స్ పన్ను వసూళ్లు రూ.3.19 లక్షల కోట్లు జరిగాయి.
అడ్వాన్స్ టాక్స్లో కార్పొరేషన్ టాక్స్ రూ.3,49,045.4 కోట్లు. వ్యక్తిగత ఆదాయం పన్ను రూ.1,10,871.7 కోట్లు. ఆదాయం పన్ను వసూళ్లు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు సీబీడీటీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతియేటా అడ్వాన్స్ టాక్స్ మూడో వాయిదా చెల్లింపునకు తుది గడువు డిసెంబర్ 15.
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9,45,276.6 కోట్లు ఉన్నాయి. వీటిలో కార్పొరేట్ ఇన్కం టాక్స్ రూ.5,15,870.5 కోట్లు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)తోపాటు పర్సనల్ ఇన్కం టాక్స్ రూ.4,29,406.1 కోట్లుగా ఉంది.