న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. శరవేగంగా అడుగులేస్తున్నది. ఇప్పటికే ఎయిర్ ఎండియా, బీఎస్ఎన్ఎల్, విశాఖ స్టీల్స్తోపాటు పలు ప్రైభుత్వ రంగ సంస్థలను (పీఎస్యూ) ఇంతకుముందే ప్రకటించింది. ఇక తాజాగా పలు నగరాల్లోని విమానాశ్రయాలను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నది.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వాటాలను పూర్తిగా విక్రయించాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయాల్లో ఏఏఐ వాటాల విక్రయం ద్వారా రూ. 2.5 లక్షల కోట్ల నిధులు సమీకరించాలని కేంద్రం నిర్ణయించినట్టు అధికార వర్గాల కథనం.
ఇప్పటికే తొలిదశలో లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల కాంట్రాక్ట్లను అదానీ గ్రూప్ దక్కించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణకు మొత్తం 13 విమానాశ్రయాలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో హైదరాబాద్ సహా నాలుగు విమానాశ్రయాల్లోని ఏఏఐ వాటాలను అమ్మేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలు త్వరలో కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పెట్టనున్నారు.
విమానాశ్రయాల ప్రైవేటీకరణ విషయమై కేంద్రం.. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు లాభాల్లో ఉన్న, అంతగా లాభాల్లో లేని విమానాశ్రయాలను కలిపి విక్రయించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నది. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏఏఐ దేశవ్యాప్తంగా 100పై చిలుకు విమానాశ్రయాలను నిర్వహిస్తున్నది.
కాగా, ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్నకు 74 శాతం వాటా ఉంది. మిగతా 26 శాతం వాటా ఏఏఐ సొంతం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపునకు 54 శాతం వాటా ఉండగా, ఏఏఐకి 26 శాతం, ఫ్రాపోర్ట్ ఏజీ అండ్ ఎరామన్ మలేసియాకు 10 శాతం వాటా ఉంది. హైదరాబాద్లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉండగా, బెంగళూరులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.