న్యూఢిల్లీ: ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరల భగభగలు.. మరోవైపు విద్యుత్ వాహనాల ధరలు ప్రియం.. ఈ నేపథ్యంలో పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం చకచకా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) కింద ప్రకటించిన రాయితీలను 2024 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
పబ్లిక్ అండ్ షేర్డ్ ట్రాన్స్పోర్టేషన్ను విద్యుద్దీకరించేందుకు మద్దతు ఇవ్వడంపైనే ఫేమ్-2 ఫోకస్ చేస్తుంది. 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులో ఉన్న ఫేమ్ పథకాన్ని మూడేండ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించారు.
కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఫేమ్ భారత్ ఫేస్-2ను రెండేండ్లు అంటే 2024 మార్చి 31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. 2015 నుంచి ఫేమ్ పథకం అమలులో ఉంది.
ప్రస్తుతం విద్యుత్ వాహనాల కొనుగోలుపై ఫేమ్-2 కింద ఒక కేడబ్ల్యూహెచ్కు రూ.10వేల సబ్సిడీని రూ. 15 వేలకు పెంచి వేసింది. వాహనం ఖరీదులో 20 శాతమే అందించే సబ్సిడీని సైతం 40 శాతానికి పెంచింది.
దీంతో విద్యుత్ వాహనాల తయారీ సంస్థలు ఫేమ్-2 కింద వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. తదనుగుణంగా వాహన ధరలను తగ్గిస్తున్నాయి. హీరో ఎలక్ట్రిక్, ఏథేర్, ఆంపియర్, టీవీఎస్ తదితర ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు ధరలను తగ్గించాయి.