న్యూఢిల్లీ: జీడీపీ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై విపక్షాల విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పి కొట్టారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం 12.4 శాతానికి చేరుకున్నదని ఒక ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. యూపీఏ 2.0 హయాంలో అమలు చేసిన విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీశాయన్నారు.
‘బీజేపీ లూటింగ్ ఇండియా’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణపై ఆమె స్పందిస్తూ.. ‘యూపీఏ ప్రభుత్వ హయాంలో లూటీకి పాల్పడినందుకు కొందరు మంత్రులు జైలుకు వెళ్లారు’ అని గుర్తు చేశారు.
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ 2014లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 2018 వరకు దేశ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి కలిగించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. 2014లో యూపీఏ ప్రభుత్వం నుంచి ఎన్డీఏ సర్కార్కు పూర్తిగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా వచ్చిందన్నారు.
ఇంధన ధరల పెరుగుదల, రిటైల్ ద్రవ్యోల్బణం, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా స్పందించారు. ‘మేం ప్రతి ఒక్కరి సంరక్షణ బాధ్యతలు చూస్తాం. కేవలం ఓటర్ల గురించి ఆలోచించం’ అని వ్యాఖ్యానించారు.
‘మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎంఎస్ఎంఈలు మధ్య తరగతి కిందకు వస్తారా.. రారా.. ఈపీఎఫ్వో నిధుల నుంచి ఉద్యోగులు నగదు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతినించాం’ అని తెలిపారు.