న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి కలిగించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే విషయమై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరోనా రెండో వేవ్ వేళ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి, వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకునే చర్యలను ఆమె ఒక ఆంగ్ల చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
‘దేశ ఆర్థిక వ్యవస్థ వ్రుద్ధిపై నాకు విశ్వాసం ఉంది. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో పరస్పర సహకారంంతో ముందుకు వెళ్లాల్సి ఉంంది. ప్రస్తుతం జాతి అసాధారణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఎమర్జెన్సీ కన్నా ఎక్కువగా మహమ్మారి వల్ల నష్టం వాటిల్లింది’ అని నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా రెండో వేవ్ తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఏ దేశం కూడా రెండోవేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం కాలేదన్నారు. ఏ ఒక్కరూ రెండో వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఊహించలేదన్నారు.
కరోనా హయాంలో పేదలను ఆదుకునేందుకు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నదని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ‘ఇప్పటివరకు 26.5 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది. గత 24 గంటల్లో 39 లక్సల వ్యాక్సిన్లు ఇచ్చాం. చైనా, అమెరికాల్లో 30 కోట్ల మంది చొప్పున మాత్రమే టీకాలు తీసుకున్నారు’ అని చెప్పారు.
ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ తమ ప్రభుత్వ ప్రాధాన్యం అని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వ్యాక్సిన్ల పంపిణీని సునిశితంగా పర్యవేక్షిస్తున్నారని నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచడమే తమ ప్రాధాన్యమని తెలిపారు.