న్యూఢిల్లీ: ఈ-కామర్స్ బిజినెస్కు కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తున్నది. ఈ మేరకు వినియోగదారుల పరిరక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు-2020కు గణనీయ సవరణలు చేయనున్నదని తెలుస్తున్నది.
కస్టమర్లను ఆకర్షించడానికి ఆయా సంస్థలు తరుచుగా ఫ్లాష్ సేల్స్ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్లాష్ సేల్స్పై నిషేధం విధించేందుకు చర్యలు చేపట్టనున్నది. ప్రత్యేకించి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వ్యాపార లావాదేవీల నియంత్రణే కేంద్రం వ్యూహంగా కనిపిస్తున్నది.
ఇందుకోసం వినియోగదారుల పరిరక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు-2020కు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదాను రూపొందించింది. డేటా ప్రొటెక్షన్తోపాటు ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతానికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నది.
ఈ ముసాయిదాపై వినియోగదారుల వ్యవహారాల శాఖ వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను కోరింది. 15 రోజుల్లో అంటే జూలై ఆరవ తేదీ లోగా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది.
తాజాగా ప్రతిపాదించిన సవరణల వల్ల ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో పారదర్శకతను తేవడంతోపాటు నియంత్రణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికార వర్గాల కథనం. ఈ-కామర్స్ సంస్థలు విస్తృతంగా మోసాలు, అనుచిత వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నాయని కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి.
సంప్రదాయ ఈ-కామర్స్ ఫ్లాష్ సేల్స్పై నిషేధం ఉండదని, బ్యాక్ టూ బ్యాక్ లేదా ఫ్లాష్ సేల్స్ మాత్రమే నిషేధం విధిస్తామని వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులు తెలిపారు.