గూగుల్ భాగస్వామ్యంతో వస్తున్న జియోఫోన్ నెక్స్
వినాయక చవితికి మార్కెట్లో విడుదల
ముంబై, జూన్ 24: మొబైల్ వినియోగదారులకు చౌక ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చిన జియో.. ఇప్పుడు అగ్గువకే సరికొత్త స్మార్ట్ఫోన్నూ పరిచయం చేయనున్నది. గూగుల్తో కలిసి రూపొందిస్తున్న ‘జియోఫోన్ నెక్స్’ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధర కలిగిన స్మార్ట్ఫోన్ అని రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు గురువారం జరిగిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో తెలిపారు. అయితే ధర ఎంత? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. గతేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ వెంచర్ జియో ప్లాట్ఫామ్స్లో 7.7 శాతం వాటా కోసం గూగుల్ రూ.33,737 కోట్ల పెట్టుబడులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చౌక స్మార్ట్ఫోన్ల తయారీకి జియోతో కలిసి గూగుల్ కృషి చేస్తున్నది.
జియోఫోన్ నెక్స్ విశేషాలు
‘మా ఈ అత్యంత చౌక 4జీ స్మార్ట్ఫోన్తో భారత్కు 2జీ నుంచి విముక్తి లభించగలదు. ఇప్పటికీ దేశంలో దాదాపు 30 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు సరైన స్మార్ట్ఫోన్లు లేవు. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న 4జీ స్మార్ట్ఫోన్లను కొనే సామర్థ్యం లేక 2జీ సేవలకే పరిమితమయ్యారు. కారణం అధిక ధరలే. అందుకే జియోఫోన్ నెక్స్ను చౌక ధరతో తీసుకువస్తున్నాం. ఇది నిజంగా ఓ సంచలనం. భారతీయ మార్కెట్కు అవసరమైన ఫోన్’
-ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్
‘వంద కోట్లకుపైగా ఉన్న భారతీయులకు ఈ ఫోన్ ఎంతో ఉపయోగకరం. నాణ్యమైన ఇంటర్నెట్ను వేగంగా అందుకోవడానికి, ముఖ్యంగా వ్యాపారాలను డిజిటలైజ్ చేసుకోవడానికి దోహదపడుతుంది. ఇందులో అత్యుత్తమ ఫీచర్లున్నాయి. ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాల్లో నూతన సేవల నిర్మాణానికి జియోకూ సహకరిస్తుంది. గూగుల్ క్లౌడ్, జియో మధ్య కొత్త 5జీ భాగస్వామ్యంతో ఇరు సంస్థల బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను’
-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవో