తిరుమలగిరి మే 24 : సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నది. తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పోలీసులు క్యాంపు వేసి అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికి జరిమానాలు విధిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో రెండు రోజులుగా వాహనాలు, ప్రజల రాకపోకలు లేకపోవడంతో చౌరస్తా నిర్మానుష్యంగా మారింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు
తుంగతుర్తి : వాహనదారులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉదయం 10గంటల తర్వాత వీధుల్లో అనుమతి లేని వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా సహకరించాలని కోరారు. ట్రైనీ ఎస్ఐ భావన, పోలీసు సిబ్బంది బాబర్, వెంకన్న, రవి, మహేందర్గౌడ్ పాల్గొన్నారు.
అర్వపల్లి : లాక్డౌన్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్ఐ మహేశ్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. కార్యక్రమంలో పోలీసులు సైదులు, నాగార్జున, అశోక్, రామ్మూర్తి, రాజు పాల్గొన్నారు.
ఏడు బైక్లు సీజ్..
ఆత్మకూర్(ఎస్) : నెమ్మికల్ గ్రామంలోని సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా బయటకు వచ్చిన ఏడు బైక్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ లింగం తెలిపారు. 24వాహనాలకు జరిమానా విధించామన్నారు.