ముంబై : కరోనా కట్టడికి ముంబైలో ఈనెల 28 రాత్రి పదిగంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతుందని నగర మేయర్ కిషోరి పెడ్నేకర్ శనివారం పేర్కొన్నారు. కర్ఫ్యూ వేళల్లో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతిస్తామని, హోటళ్లు, పబ్లు మూతపడతాయని చెప్పారు. మురికివాడలతో పోలిస్తే అపార్ట్మెంట్లు, హైరైజ్ భవనాలున్న ప్రాంతాల్లోనే అధిక పాజిటివ్ రేటు కనిపిస్తోందని అన్నారు.
కాగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఈనెల 28 నుంచి మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ అమలవుతుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే వెల్లడించారు. ఆదివారం రాత్రి నుంచి కర్ఫ్యూ ఉత్తర్వులు అమలవుతుండగా షాపింగ్ మాల్స్ను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ మూసిఉంచేలా స్ధానిక అధికారులు చర్యలు చేపడతారు.
ప్రజలు కొవిడ్-19 నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో కఠిన నియంత్రణలు అమలవుతాయని సీఎం ఠాక్రే హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దవాఖానల్లో తగినన్ని పడకలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.