న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్లు, ఔషధాలు, పరికరాలపై జీఎస్టీ యధాతథంగా కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్ నియమించిన మంత్రివర్గ ఉపసంఘం (జీవోఎం) సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు గత నెల 28న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా సారధ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు.
ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఐదు శాతం, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నది కేంద్రం. కోవిడ్-19 చికిత్స కోసం రోగులు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది.
ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్లు, ఔషధాలు, ఇతర పరికరాలపై జీఎస్టీని మినహాయించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. బీజేపీయేతర పార్టీల సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోవిడ్-19 వ్యాక్సిన్లు తదితరాలపై పన్ను మాఫీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.
శనివారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వ్యాక్సిన్లు, ఔషధాలు, ఇతర పరికరాలపై పన్ను మినహాయించాలా? వద్దా? అన్న విషయమై తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. దీని ప్రకారం పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్లు, సర్జికల్ మాస్కులపై ఐదు శాతం, అంబులెన్స్లపై 28 శాతం జీఎస్టీ కొనసాగనున్నదని తెలుస్తున్నది.
అయితే, తోసిలిజుమాబ్, అంఫోటెరిసిన్ బీ ఔషధాలపైన, రక్తం గడ్డ కట్టకుండా నివారించే హెపారిన్ అనే ఔషధంపైనా పూర్తిగా పన్ను మినహాయించాలని జీవోఎం సిఫారసు చేసినట్లు సమాచారం.
ఇక ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు వినియోగించే రెమ్డెసివిర్పై ఐదు శాతం జీఎస్టీ విధించాలని ప్రతిపాదించినట్లు వినికిడి. ఆక్సీమీటర్, మెడికల్ ఆక్సిజన్, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లపై జీఎస్టీలో కోత విధించాలని సూచించింది.