న్యూఢిల్లీ, జూన్ 4: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పడిపోవడంతో ధరలు దిగొస్తున్నాయి. దేశరాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.390 తగ్గి రూ.48 వేల దిగువకు చేరుకున్నది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.47,910 వద్ద నిలిచింది. గడిచిన వారం రోజుల్లో బంగారం రూ.2 వేలకు పైగా తగ్గినట్లు అయింది. వెండి ఏకంగా రూ.920 తగ్గి రూ.70 వేల దిగువకు రూ.69,370కి చేరుకున్నది. అలాగే హైదరాబాద్లో తులం పసిడి ధర రూ.760 తగ్గి రూ.49,640 వద్దకు చేరుకున్నది. 22 క్యారెట్ల ధర రూ.45,500గా ఉన్నది.అలాగే కిలో వెండి ఏకంగా రూ.2 వేలు తగ్గి రూ.75,500 నిలిచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటంతో అనూహ్యంగా డాలర్కు డిమాండ్ నెలకొన్నది..దీంతో బంగారం ధరలు రెండు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,870 డాలర్లు పలుకగా, వెండి 27.35 డాలర్ల వద్ద ఉన్నది.