ముంబై : గత కొద్ది వారాలుగా పైపైకి ఎగబాకిన పసిడి ధరలు గురువారం దిగివచ్చాయి. వడ్డీ రేట్లను పెంచుతామని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు పంపడంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ కు అనుగుణంగా దేశీ మార్కెట్ లోనూ ఈ లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఫెడ్ ప్రకటనతో బంగారం, వెండి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎంసీఎక్స్ లో పదిగ్రాముల బంగారం రూ 48,000 దిగువకు పడిపోయి రూ 47,739 పలికింది. ఇక కిలో వెండి ఏకంగా రూ 1200 పతనమై రూ 70.240 పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2.24 శాతం తగ్గి 1820 డాలర్లకు పడిపోయింది. స్పాట్ గోల్డ్ ధరలు ఔన్స్ కు 1797 డాలర్ల స్థాయికి పడిపోతే బంగారం ధరలు భారీగా తగ్గుతాయని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.