శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. గ్రనేడ్ పోలీసులకు దూరంగా పడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సాంబా-ఉధంపూర్ రోడ్లో నాడ్ వద్ద చోటు చేసుకుందని చెప్పారు. పోలీస్ పార్టీ వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వారిని లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరారని పేర్కొన్నారు. గ్రనేడ్ పోలీసులకు దూరంలో బహిరంగ ప్రదేశంలో పడి పేలింది. ఇందులో ఎవరికీ ఏమీ కాలేదని, వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.