రక్షణ చర్యలు చేపట్టాకే ఆర్ఎఫ్సీఎల్ను ప్రారంభించాలి
ఇక్కడి పరిణామాలను సీఎం దృష్టికి తీసుకవెళ్తా
ఎమ్మెల్యే కోరుకంటి చందర్
ఫర్టిలైజర్సిటీ, మే 20: రామగుండం ప్రజల ఆరోగ్యాలే తమకు ముఖ్యమని, అమ్మోనియా లీక్ గాకుండా ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. రెండు రోజుల క్రితం ప్లాంట్ నుంచి అమ్మోనియా లీకేజీతో ప్రజలు భయాందోళన చెందుతున్న నేపథ్యంలో కర్మాగారాన్ని సీపీ సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం ఆర్ఎఫ్సీఎల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియా లీకవుతుండడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని చెప్పారు. పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టాకే కర్మాగారం ప్రారంభించాలన్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్తానని చెప్పారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ వారం నుంచి అమ్మోనియా లీకవుతుందనే సమాచారంతోనే క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చామని, యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రాణ హానీ ఉండదు : జీఎం
ఎరువుల ఉత్పత్తి సమయంలో నీటి గుండా అమ్మోనియా కొంచెం వచ్చిందని, కానీ దాంతో ఎలాంటి ప్రాణహాని ఉండదని ఆర్ఎఫ్సీఎల్ జీఎం పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కర్మాగారం పూర్తి స్థాయిలో ఆటోమెటిక్ విధానంతో పని చేస్తుందనీ, ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే కర్మాగారం ఆఫ్ అవుతుందన్నారు. పారిశ్రామిక చట్టాలు, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడే ఉత్పత్తి చేస్తున్నామని, ప్రభావిత గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాతనే వీటిని విడుదల చేస్తామని చెప్పారు. కాగా, ప్రజాసంబంధాల విషయంలో ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నదనీ, కర్మాగారంలో ఏం జరుగుతుందో కనీస సమాచారం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే, సీపీ ఎదుట విలేకరులు వాపోగా, స్పందించారు. సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. ఇక్కడ మేయర్ డా.అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్ నీల పద్మ గణేశ్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవిదాస్, పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ ఉమెందర్, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు, కర్మాగారం జీఎం బంగార్, హెచ్ఆర్ మేనేజర్ సోమనాథ్ సోలంకి, అసిస్టెంట్ మేనేజర్ నాగవంశీ ఉన్నారు.