న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: గతకొద్ది రోజులుగా తరచూ పడిపోతున్న బంగారం ధరలు.. శుక్రవారం మరింతగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఒక్కరోజే తులం ధర రూ.1,130 తగ్గింది. దీంతో 10 గ్రాముల విలువ రూ.45,207కు దిగిం ది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనం కావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్పై స్పష్టంగా కనిపించినట్లు బులియన్ వర్గాలు చెప్తున్నాయి. గురువారం 10 గ్రాముల పుత్తడి ధర రూ.46,337గా ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. వెండి ధర కిలో రూ.708 తగ్గి రూ.60,183గా ఉన్నది. అంతకుముందు రోజు రూ.60,891గా ఉన్నది.
హైదరాబాద్లో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 పలికింది. క్రితం రోజుతో పోల్చితే రూ.650 దిగింది. ఇక 22 క్యారెట్ల విలువ రూ.600 పడిపోయి రూ.43,400లకు చేరింది. వెండి ధర కూడా బాగా తగ్గింది. కిలో వెండి ఈ ఒక్కరోజే ఏకంగా రూ.1,900 దిగి రూ.65,900ల వద్ద నిలిచింది. గురువారం కిలో వెండి ధర రూ.67,800 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,762 డాలర్లుగా, వెండి ధర 22.95 డాలర్లుగా ట్రేడ్ అవుతున్నది. పెరుగుతున్న డాలర్ విలువ, బలపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థలు బంగారం మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రధాన విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ స్టాక్స్ వైపు తరలిపోతున్న మదుపరుల పెట్టుబడులు కూడా కారణమేనన్నారు.