ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం.. కొందరిలో తీవ్రత ఎక్కువ.. మరికొందరిలో మోస్తరు లక్షణాలున్నా నాలుగైదు రోజుల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న వైనం.. ఇదీ కొవిడ్ మహమ్మారి ప్రజలను వణికిస్తున్న తీరు. ముందుగానే అప్రమత్తమైతే తప్ప కొవిడ్ భూతం
ఆరోగ్యాన్ని ఎంతమేర దెబ్బతీస్తున్నదనేది తెలుసుకోవడం సాధ్యం కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనా పాజిటివ్ వచ్చినవారు నాలుగైదు రోజుల్లో కొవిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకొంటేనే మేలని ఉస్మానియా దవాఖాన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రవణ్కుమార్ సూచిస్తున్నారు. వైరస్ శరీరంలో ఏయే మార్పులకు కారణమైంది? రక్తంలో ఎంత ఇన్ఫెక్షన్ చేరింది? ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె తదితర కీలక అవయవాలకు ఏదైనా ముప్పు వాటిల్లిందా? అనేది వైద్యులు శాస్త్రీయంగా గుర్తించేందుకు ఈ ప్రొఫైల్ పరీక్షలు దోహదపడతాయని చెప్పారు. ప్రధానంగా రక్తంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా, రక్తం గడ్డ కట్టే పరిస్థితులు ఉన్నా ఈ పరీక్షల్లో ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుందని, తద్వారా వెంటనే తగిన మందులు వాడటం వల్ల వ్యాధి ముదిరి ఇతర అవయవాలపై ప్రభావం చూపకుండా ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చన్నారు. ఈ నేపథ్యంలో అసలు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, కొవిడ్ ప్రొఫైల్తో పాటు సీటీ స్కాన్లో వ్యాధి నిర్ధారణ ప్రమాణాలను ఓసారి పరిశీలిస్తే…
సాధారణంగా కరోనా నిర్ధారణకు పరీక్షలు ర్యాపిడ్ టెస్టులతోపాటు ఆర్టీపీసీఆర్ నిర్వహిస్తున్నారు. ముక్కు, గొంతు నుంచి తీసిన నమూనాలతో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి దశలో ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్, నెగెటివ్ అని మాత్రమే ఫలితాలు ఇచ్చేవారు. రెండో వేవ్లో వైరస్ తీవ్రతను కూడా సూచిస్తూ ఫలితాలు ఇస్తున్నారు. వాటి ప్రకారం
సాధారణంగా పరీక్షలో సైకిల్ త్రెషోల్డ్ వాల్యూ (సీటీ వాల్యూ) ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు.
సాధారణంగా పాజిటివ్ నిర్ధారణ అయిన నాలుగైదు రోజులకు కొవిడ్ ప్రొఫైల్ నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్న వైద్యులు. వారం రోజులైనా కొవిడ్ లక్షణాలు తగ్గకపోగా తీవ్రమవుతుంటే వెంటనే సీటీ స్కాన్ చేయించుకోవడం మంచిదని డాక్టర్ శ్రవణ్కుమార్ తెలిపారు. దీని ద్వారా వైరస్ ఊపిరితిత్తుల్లో ఎంతమేర ప్రభావాన్ని చూపిందనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరుగుతుందన్నారు. సీటీ స్కాన్లో కరోనా తీవ్రతను కొరాడ్స్లో సూచిస్తారు. ఇందులో. ఒకటి నుంచి ఆరు దశలు ఉంటాయి.
కొరాడ్స్-1 : ఇబ్బంది ఏమీలేదు
కొరాడ్స్-2 : స్వల్ప లక్షణాలు ఉన్నట్టు. ఇది కేవలం కరోనా వల్లనే అని నిర్ధారణ కాదు.
కొరాడ్స్-3 : లక్షణాలు ఉన్నట్టు.
కొరాడ్స్-4 : కరోనా తీవ్రంగా ఉన్నట్టు.
కొరాడ్స్-5 : కరోనా తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నట్టు.
కొరాడ్స్-6 : కరోనా లక్షణాలు అతి తీవ్రంగా ఉన్నట్టు.
సీటీ సూచికలో ఊపిరితిత్తులపై వైరస్ ఎంత ప్రభావం చూపిందనేది నిర్ధారిస్తారు. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ఐదు లోబ్స్ (భాగాలు) ఉంటాయి. ఒక్కో లోబ్లో 0-5 పాయింట్ల చొప్పున మొత్తం 25 పాయింట్లను లెక్కిస్తారు.
కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యి నాలుగైదు రోజులపాటు లక్షణాలు తగ్గకపోతే కొవిడ్ ప్రొఫైల్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని డాక్టర్ శ్రవణ్కుమార్ తెలిపారు. ముఖ్యంగా 40 ఏండ్ల పైబడిన వారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు కొవిడ్ బారిన పడితే కచ్చితంగా ఈ ప్రొఫైల్ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. కొవిడ్ వైరస్ శరీరంలో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందనేది ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని, ఒక్కొక్కరి శరీరంలో ఒక్కో తీరుగా వైరస్ ప్రభావం కనిపిస్తుందన్నారు. అందుకే నాలుగైదు రోజుల్లో ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల వైరస్ ప్రభావం ఏయే అవయవాలపై, ఎంత మేర ఉందనేందుకు అంచనాకు రావొచ్చన్నారు.