భాషా పండితులు, పీఈటీల ప్రమోషన్లకు లైన్ క్లియర్
జీవోల సవరణలతో మార్గం సుగమం
త్వరలో షెడ్యూల్ విడుదల
సీఎం నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు
మంచిర్యాల, ఏప్రిల్ 2, నమస్తే తెలంగాణ : సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భాషా పండితులు, పీఈటీల ఉద్యోగోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రమోషన్లు కల్పించేందుకు అనుమతిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తుండడంతో పండిట్, పీఈటీల ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. భాషాభిమాని సీఎం కేసీఆర్ నిర్ణయంతో ప్రమోషన్లకు అవకాశం వచ్చినందుకు, తమ కల ఫలించనున్నందుకు వారిలో సంతోషం వ్యక్తం అవుతున్నది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రేడ్-2, భాషా పండిత, పీఈటీ పోస్టులు మొత్తం 1,036 ఉన్నాయి. ఇందులో భాషా పండిట్ల పోస్టులు 905 కాగా, ప్రస్తుతం 828 మంది విధులు నిర్వహిస్తున్నారు. 131 పీఈటీ పోస్టులకుగాను 119 మంది పనిచేస్తున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఫిజికల్ డైరెక్టర్లుగా (పీడీ), భాషా పండితులకు ప్రమోషన్లు కల్పించేందుకు అడ్డుగా ఉన్న జీవో 11, 12లను సవరించి, సర్వీస్ రూల్స్లో మార్పులు చేశారు. ఎస్జీటీలకూ న్యాయం చేసేందుకుగాను సర్కారు ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులను మంజూరు చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నది.
జీవో సవరణతో తొలగిన తెర..
తమతో పాటు పనిచేస్తున్న ఇతర విషయ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ (ఉన్నత) హోదాను కలిగి ఉంటే తమకు అన్యాయం జరుగు తున్నదని ఏండ్లుగా దశలవారీగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కాగా, భాషా పండితులకు పదోన్నతులు కల్పించేందుకు అడ్డుగా ఉన్న జీవో 11, 12ను ప్రభుత్వం గతంలోనే సవరించింది. భాషా పండితుల పోస్టు లను అప్గ్రేడ్ చేస్తూ 2017, 19లలో ఉత్తర్వులు జారీ చేయగా, ఈ రెండు జీవోల కారణంగానే ఉద్యోగోన్నతులు కల్పించలేని పరిస్థితి ఏర్ప డింది. దీంతో ఆ ఉత్తర్వుల్లోని లొసుగులను సవరిస్తూ, సర్వీసు రూల్స్ను మారుస్తూ ఫిబ్రవరి 6న జీవో 2, 3లను జారీ చేసింది. షెడ్యూల్ను విడుదల చేయాల్సిన క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. తాజాగా ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ముగ్గురికీ సమన్యాయం
పండిట్, పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్తో తాము నష్టపోతామని ఎస్జీటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచిస్తున్నది. వీరికి న్యాయం చేసేందుకుగాను సర్కారు ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులను మంజూరు చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నది. ఎస్జీటీలకు ఉద్యోగోన్నతుల్లో జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకే ప్రభుత్వం హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భాషా పండితులు, పీఈటీలు, ఎస్జీటీలందరికీ సమన్యాయం జరగనున్నది.
ఉమ్మడి జిల్లాలో 1,036 పోస్టులు..
ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్య పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్లేన్ (మైదాన), ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో కలిపి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రేడ్-2 భాషా పండిత, పీఈటీ పోస్టులు మొత్తం 1,036 ఉన్నాయి. ప్రభుత్వ, స్థానిక విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ)లను ఎస్జీటీలుగా పరిగణిస్తున్నారు. వీరంతా ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నా పీఈటీలుగానే కొనసాగుతున్నారు. ఫిజికల్ డైరెక్టర్లుగా (పీడీ) ప్రమోషన్లు పొందేందుకు మిగతా సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) సైతం బీపీఈడీ (బ్యాచ్లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సును పూర్తిచేసి పోటీపడుతున్నారు. దీంతో పీఈటీలకు పీడీలుగా ప్రమోషన్లు దక్కడం లేదు. తెలుగు సబ్జెక్టును ఆప్షనల్గా ఐదేండ్ల పాటు చదివి భాషా పండిట్లుగా నియామకమైన తాము ఎలాంటి ఉద్యోగోన్నతికి నోచుకోవడం లేదని, పండితులుగానే విరమణ పొందాల్సి వస్తున్నదని ఆవేదన చెందారు. తమతో పాటు బోధన చేసే ఇతర విషయాల టీచర్లు ఉన్నత హోదాలు పొందుతున్నారని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. న్యాయంగా తమకు దక్కాల్సిన పోస్టులను ఎస్జీటీలు ప్రమోషన్ల ద్వారా పొందుతుండడంతో తమ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని పీఈటీలు, పండిట్లు కొంతకాలంగా కోరుతున్నారు. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాషా పండితులతో పాటు పీఈటీల పోస్టులను సైతం అప్గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ఆయా జీవోలను సవరిస్తూ సర్వీస్ రూల్స్ను మార్పు చేస్తూ విద్యాశాఖ స్పెషల్ సీఎస్ జీవోలను జారీ చేసింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో పీడీ పోస్టులన్నీ పీఈటీలకే దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 131 వ్యాయామ పోస్టులకు 119 మంది పీఈటీలు ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్నారు. భాషా పండిత పోస్టులు 905 ఉండగా, ప్రస్తుతం 828 మంది పనిచేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే.. తెలుగు 129, హిందీ 120, ఉర్దూ 4 భాషా పండిత పోస్టులు ఉన్నాయి. వీటికిగాను 129 మంది తెలుగు, 113 మంది హిందీ, ఒకరు ఉర్దూ బోధకులు ఉన్నారు. పీఈటీ పోస్టులు 40 ఉండగా, 35 మంది వ్యాయామ ఉపాధ్యాయులు అర్హత పొంది ఉన్నారు.
జీవోల సవరణ హర్షణీయం
పీఈటీలుగా చేరిన చాలా మంది పీఈటీలుగానే ఉద్యోగ విరమణ చేశారు. పీడీగా పదోన్నతి పొందాలనేది కలగానే మిగిలింది. వ్యాయామ ఉపాధ్యాయులకు పీడీలుగా అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బాగుంది. మా ఏండ్ల నాటి కల నెరవేరనుంది. జీవోలను సవరించడం హర్షణీయం.
ఇవి కూడా చూడండి..
తెలంగాణ హీరోతో సాయి పల్లవి
4 నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం