ఐదు రోజుల్లో రూ.1,500 తగ్గుదల
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 28: బంగారం ధరలు పడిపోతున్నాయి. వరుసగా ఐదో రోజూ పుత్తడి విలువ క్షీణించింది. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.505 దిగి రూ.46,518కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక గత ఐదు రోజుల్లో గోల్డ్ ధర రూ.1,500లకుపైనే తగ్గినట్లు బులియన్ మార్కెట్ గణాంకాలతో స్పష్టమవుతున్నది. కిలో వెండి ధర సైతం రూ.828 దిగివచ్చింది. ప్రస్తుతం కిలో రూ.67,312 పలుకుతున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్సు పుత్తడి 1,769 డాలర్లు, వెండి 26.02 డాలర్లుగా ఉన్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,160, 22 క్యారెట్ల ధర రూ.44,150గా ఉన్నది. కిలో వెండి రూ.73,500లు పలుకుతున్నది.