హైదరాబాద్ : రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రాత్రి 9 గంటల వరకే బస్సు సర్వీసులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. నగరంలో బస్సు సేవలు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే బస్సులను రాత్రి 9 గంటల తరువాత కూడా సంబంధిత డిపోలకు అనుమతిస్తామని చెప్పారు.
ఏప్రిల్ 30 వరకు నగరంలో రాత్రి 9 గంటల తరువాత అన్ని సేవలను రద్దు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (జీహెచ్జెడ్) వి వెంకటేశ్వర్లు తెలిపారు. తాము ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ప్రయాణీకుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సీటింగ్ సామర్థ్యంపై గత కొన్ని వారాలుగా సిటీ బస్సులు 45 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయలేదని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ 2,800 బస్సులను నడుపుతోందన్నారు. చివరి సర్వీసులను రద్దు చేయడం మినహా బస్సు సర్వీసులు తగ్గించబడవని ఆయన తెలిపారు.