న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 7: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో అనూహ్యంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొన్నది. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.500 వరకు పెరిగి మళ్లీ రూ.47 వేలు దాటింది. చివరకు రూ.47,185 వద్ద ముగిసింది. బంగారంతోపాటు వెండి భారీగా పుంజుకున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.1,050 అధికమై రూ.70,791 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ లోహాల కొనుగోళ్ళు ఊపందుకోవడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అలాగే హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.550 అధికమై రూ.48,550 పలికింది. 22 క్యారెట్ల ధర రూ.44,500 వద్ద ఉన్నది. వెండి ఏకంగా రూ.2 వేలు అధికమై రూ.76 వేలకు చేరుకున్నది. మరోవైపు, న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,820 డాలర్లు పలుకగా, వెండి 27.33 డాలర్లుగా ఉన్నది.