అమరావతి : రాష్ట్రవాప్తంగా మరో ఆరురోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. హమాలీలు, గోనె సంచుల కొరత ఉంటే సమకూర్చుకోవాలని సూచించారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. మిల్లర్లు తుకాల్లో తరుగు తీయకుండా తనిఖీలు చేయాలని చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరిగేలా చూడాలన్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సమావేశంలో ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, సరఫరా, సూపర్ స్ప్రెడర్లలకు వ్యాక్సినేషన్ తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న ఖరీఫ్ సీజన్ సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువుల నిల్వలు ఉండేలా చూడాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారులతో కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. సూపర్ స్ప్రెడర్ల కేటగిరిలో నిర్దేశించిన వారికే కొవిడ్ టీకాలు వేయాలని అన్నారు. సూపర్ స్ప్రెడర్లకు కొవిషీల్డ్ టీకాలు మాత్రమే వేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.