ఏడు నెలల్లో రూ.12వేలకుపైగా తగ్గిన పుత్తడి ధర
గతేడాది రికార్డు స్థాయిలో రూ.57,008 పలికిన తులం
ప్రస్తుతం తులంరూ.44,372
పసిడి వన్నె తగ్గుతున్నది. గతేడాది ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరలు.. గతకొద్ది రోజులుగా నేలచూపు చూస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయి నుంచి తులం విలువ రూ.12వేలపైనే పడిపోయింది. ఈ పతనం ఇంకా కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
న్యూఢిల్లీ, మార్చి 4: బంగారం ధరలు క్రమేణా తగ్గుతున్నాయి. గతేడాది రికార్డుల మోత మోగించిన పసిడి ధర.. గతకొద్ది రోజులుగా ఆ శిఖరంపై నుంచి పట్టుతప్పి పడిపోతున్నది. ఇప్పటిదాకా రూ.12వేలపైనే దిగజారింది. నిరుడు ఆగస్టు 7న 10 గ్రాముల పుత్తడి విలువ మునుపెన్నడూ లేనివిధంగా రూ.57,008 పలికింది. ఇప్పటిదాకా బంగారం ధరల్లో ఇదే రికార్డు. అయితే గురువారం ఇది ఢిల్లీలో రూ.44,372 వద్దకు చేరింది. బుధవారంతో పోల్చితే రూ.217 క్షీణించింది. దీంతో గడిచిన 7 నెలల్లో ధరలు రూ.12,636 దిగివచ్చినైట్లెంది.ఈ ఏడాదిలో ఇప్పటిదాకా దాదాపు 11% తగ్గింది.
రూ.40వేల దిగువకు..?
దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ.40వేల దిగువకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయి నుంచి భారీగా పతనమైన ధరలు.. మున్ముందు మరింతగా తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకులు, ఇతరత్రా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వద్ద రుణాలు తీసుకున్న వారిపై ఈ ధరల క్షీణత ప్రభావం పడుతున్నది. తీసుకున్న రుణానికి మరింత బంగారాన్ని తనఖా పెట్టాలని, లేదంటే అసలు రుణంలో కొంత తీర్చాలని బ్యాంకర్లు, రుణదాతలు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రూ.11,242 దిగిన వెండి ధర
బంగారంతోపాటు వెండి ధరలు కూడా నేలచూపు చూస్తున్నాయి. నిరుడు రూ.77,840 పలికిన కిలో ధర.. ఇప్పుడు రూ.66,598 వద్ద ఉన్నది. దీంతో రూ.11,242 తగ్గినైట్లెంది. గురువారం ఒక్కరోజే రూ.1,217 క్షీణించింది. పారిశ్రామిక రంగం నుంచి తగ్గిన డిమాండ్ వెండి ధరను దిగజార్చుతున్నది. ఇక అంతర్జాతీయంగా ఔన్సు గోల్డ్ ధర 1,717 డాలర్లుగా ఉంటే, వెండి ధర 26.09 డాలర్లుగా నమోదైంది.
ఎందుకీ క్షీణత?
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను గత నెల 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఇప్పటికే ఉన్న ప్రతికూలతలకు తోడై గోల్డ్ మార్కెట్పై నెగెటివ్ ప్రభావాన్ని చూపింది. అలాగే అమెరికా డాలర్ విలువ బలపడటం, బాండ్లకు ఆదరణ పెరుగడం, బైడెన్ సర్కారు 1.9 బిలియన్ డాలర్ల ఉద్దీపనలు తీసుకువస్తుండటం కూడా దేశీయంగా పసిడి ధరల్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా కరోనా వైరస్తో సంక్షోభంలోకి జారుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భీకర నష్టాల్లో కదలాడిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకోవడం.. మదుపరులను బంగారంపై నుంచి తమ పెట్టుబడుల్ని ఉపసంహరించేలా చేసింది. కొనుగోలుదారులు సైతం వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. దీంతో బంగారం ధరలు రోజుకింత దిగుతున్నాయి. గోల్డ్ బాండ్లపై పెట్టుబడులు కూడా భౌతిక కొనుగోళ్లను ప్రభావితం చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.