నదికే కొత్త నడక నేర్పిన చరిత్ర కేసీఆర్ది
ఇక తెలంగాణ సస్యశ్యామలం
నిజమవుతున్న రైతే రాజు నినాదం
రైతులు మొగులుకు చూడాల్సిన పరిస్థితి తప్పింది..
ఆర్థిక మంత్రి హరీశ్రావు
బొల్లారం మత్తడి వద్ద గంగమ్మకు పూజలు
మెదక్ రూరల్, ఏప్రిల్ 21:హల్దీ వాగు, మంజీర నదిపై రూ.142 కోట్లతో 19 చెక్డ్యామ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీ ఆర్కే దక్కిందని, అంతేకాకుండా ఇప్పుడు ఎండకాలంలో గోదావరి నీటిని తెచ్చింది కేసీఆరే అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం మెదక్ మండలం బొల్లారం మత్తడి వద్ద గోదావరి జలాలకు ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్తో కలిసి మంత్రి హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జలాలను తెచ్చి హల్దీ, కూడవెల్లి వాగులు, మంజీర నదిని జీవ నదులుగా మార్చారన్నారు.
హల్దీ వాగు, మంజీర నదిపై రూ.142 కోట్లతో 19 చెక్డ్యామ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెఢ్డి కెనాల్ ద్వారా తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా చెక్డ్యామ్లను నింపుతూ గోదావరి జలాలు మంగళవారం రాత్రి మెదక్ మండలం బొల్లారం మత్తడికి చేరుకున్నాయి. బుధవారం బొల్లారం మత్తడి దుంకింది. బుధవారం మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్తో కలిసి గంగమ్మకు హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత దశ దిశను మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. గతంలో నదికి అడ్డంగా వాగులు, వంకలు, ప్రాజెక్టులు కట్టడం తెలుసు. కానీ, నది లేనిచోట కొండ పోచమ్మసాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ లాంటి రిజర్వాయర్లు నిర్మించారన్నారు.
ఎక్కడో ఉన్న గోదావరి జలాలను ఈ రిజర్వాయర్లకు తెచ్చి హల్దీ, కూడవెల్లి వాగులు, మంజీర నదిని జీవ నదులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కొండ పోచమ్మసాగర్ ద్వారా వదిలిన జలాలు 32 చెక్డ్యామ్లను నింపి నిజాంసాగర్ ప్రాజెక్ట్ వైపు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ 32 చెక్డ్యామ్ల్లో ఇప్పటి వరకు 0.7 టీఎంసీల నీరు నింపుకుటున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం వరకు నిజాంసాగర్కు గోదావరి జలాలు చేరుకుంటాయని తెలిపారు. భారీగా వర్షాలు మంచిగా కురిస్తే హల్దీవాగు, మంజీర నదుల నీళ్లు నిజాంసాగర్ ప్రాజెక్ట్టుకు వెళ్లి, అక్కడి నుంచి గోదావరి నదిలోకి వెళ్లడం మనకు తెలుసు, అది చరిత్ర.. కానీ, చరిత్రను తిరగరాసి గోదావరి నీళ్లను ఎదురెక్కించిన గొప్పతనం సీఎం కేసీఆర్ది అని మంత్రి అన్నారు. మంజీర వరద రాకపోయినా, సింగూర్లో నీళ్లు లేకపోయినా కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చుకొని రైతులు రెండు పంటలు పండించుకోవచ్చన్నారు. రైతే రాజు అనే నినాదం తెలంగాణలో నిజమవుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు.
సమైక్య రాష్ట్రంలో మంజీర నదిపై ఒక్క చెక్ డ్యామ్ కట్టని చరిత్ర కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలది అని మంత్రి విమర్శించారు. మెదక్ జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పంటలు పండాయని, రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. మెతుకు సీమ అంటే మెతుకు లేని సీమగా సమైక్య పాలనలో సాగిందని, నేడు గోదావరి నీళ్లతో ఘనపూర్ ఆనకట్ట, హల్దీ వాగుకు జలకళ తెచ్చి మళ్లీ మెతుకు సీమగా సీఎం కేసీఆరే మార్చారన్నారు. ధరణితో రైతులకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ యేసయ్య, డీఈ శివనాగరాజు, ఈఈ శ్రీనివాస్, ఏఈ శ్రీహరి, బాలనగర్ సర్పంచ్ వికాస్, మండల ఉపాధ్యక్షురాలు ఆంజనేయులు, రాయినిపల్లి సర్పంచ్ సిద్దాగౌడ్, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, సమీయొద్దీన్, టీఆర్ఎస్ నాయకులు గంగాధర్, అశోక్, లింగారెడ్డి, కిష్టయ్య, అంజాగౌడ్, సొసైటీ చైర్మన్లు హన్మంత్రెడ్డి, సీతరామయ్య, రైతులు తదితరులు పాల్గ్గొన్నారు.
పొంగిపొర్లుతున్న ర్యాలమడుగు చెక్డ్యాం…
మెదక్ మండలం బొల్లారం మత్తడి దూకిన గోదావరి జలాలు ర్యాలమడుగు చెక్డ్యామ్లోకి చేరుకోవడంతో పొంగి ప్రహహిస్తున్నది. ఇక్కడి నుంచి మంజీర నదిలోకి గోదావరి జలాలు ప్రవేశించాయి. అక్కడి నుంచి హవేళీ ఘనపూర్ మండలంలోని కూచన్పల్లి, సర్దన చెక్డ్యామ్లు నిండి నిజాంసాగర్ వైపు జలాలు పరుగులు తీస్తున్నాయి.