న్యూఢిల్లీ, మే 26: అంతర్జాతీయ మార్కెట్లకు తోడు, దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్తో డిమాండ్ అధికమవడంతో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.520 అధికమై రూ.48,580 పలికింది. పెరుగకముందు ధర రూ.48 వేల స్థాయిలో ఉన్నది. దీంతో గడిచిన రెండు నెలల్లో పుత్తడి ఏకంగా రూ.5 వేలు పెరిగినట్లు అయింది. అలాగే, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి రూ.1,040 ఎగబాకి రూ.71,770కి చేరుకున్నది. సెకండ్ వేవ్ కారణంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడం కూడా ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని బంగారం వర్తకులు చెబుతున్నారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర నాలుగున్నర నెలల గరిష్ఠ స్థాయి 1,900 డాలర్లు దాటడంతో దేశీయంగా ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.