బంగారం ధర తగ్గుతున్నదెందుకు..
గత ఆగస్టులో అరవై వేల దాకా వచ్చినప్పుడు ఇక కొనగలమా? అనుకున్న వారే.. ఇప్పటికే పదివేలు తగ్గినప్పటికీ ఇంకా తగ్గినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. నిజానికి బంగారానికి మదుపు వన్నె తగ్గిందా? పతనానికి కారణమేంటి. ఇంకెంత పడుతుంది… మదుపు చేయాల్సిన పద్ధతులేమిటి? తెలుసుకుందాం…
బంగారం అంటే భద్రతకు మారు పేరు. భారతీయులకు అదోక సంప్రదాయ పెట్టుబడి. సంపదకు అతి భద్రమైన ఖజానా. భారతీయులే కాదు, ప్రపంచంలో ప్రతీ దేశపు రిజర్వ్ బ్యాంక్ అదే ఆలోచన. ఓసారి అమెరికన్ కాంగ్రెస్ రాన్ పాల్ అనే సెనేటర్ అప్పటి అమెరికా ఫెడరల్ రిజర్వ్బ్యాంక్ చైర్మన్ బెన్ బెర్నాంకేను రెండే రెండు సూటి ప్రశ్నలు వేశాడు. అందులో ఒకటి బంగారం, నగదు ఒకటేనా? దానికి బెర్నాంకే సమాధానం.. కాదు.. మరైతే సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని ఎందుకు కొంటున్నాయి. అంతకన్నా విలువైన వజ్రాలనెందుకు కొనడం లేదు? దానికి బెర్నాంకే ఒక్క క్షణం ఆలోచించి… అది సంప్రదాయంగా వస్తున్న సురక్షితమైన సాధనం కాబట్టి అనే సమాధానం కాంగ్రెస్ వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. అన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులూ ఇప్పుడు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి.
మిగతా అన్ని రకాల మదుపు సాధనాలతో పోలిస్తే చాలా వాటికన్నా బంగారం మంచి రాబడులనే ఇస్తూ వస్తున్నది. యాభై ఏండ్ల కింద రూ. 190 తో పది గ్రాముల బంగారం కొంటే అదిప్పుడు రూ.45 వేలు.. సరిగ్గా ఏడు నెలల కింద రూ.57 వేలు. అదే రూపాయి విలువ ప్రతీ ఏడాది 11 శాతం చొప్పున తగ్గుతూ వస్తున్నది. యాభై ఏండ్లలో రూపాయి విలువ 95 శాతం నష్టపోయింది. మనలో చాలా మంది నగదును దాచుకోవడానికి ఇష్టపడుతుంటారు ఈ లెక్క చూసి బెంబేలు పడటం ఖాయం. బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో ఉంటే వచ్చే వడ్డీతో కనీసం నాలుగు శాతమైనా ఆదా అవుతుంది. మీ సేవింగ్స్ బ్యాంకులో ముప్పై ఏండ్లుగా వెయ్యి రూపాయలను కదిలించకుండా వుంటే అదిప్పుడు అయ్యింది రూ. 9,984 లే. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నా సరే బంగారమే అన్ని మదుపు సాధనాలకన్నా అధిక రాబడిని ఇస్తున్నది. అదే వెయ్యి రూపాయలతో బంగారాన్ని ముప్పై ఏండ్ల కింద కొని ఉంటే దాని విలువ ఇప్పుడు అక్షరాలా రూ. 19,700.
దీర్ఘకాలికంగా చూస్తే ఈక్విటీ షేర్ల కన్నా ఎక్కువ రాబడులనే ఇస్తున్నది పుత్తడి. కానీ, అందులో రిస్క్ అర్థంచేసుకోగలిగి బ్లూచిప్ షేర్లలో లేదా ఇండెక్స్ ఈటీఎఫ్ పెట్టుబడులు పెట్టి వచ్చి డివిడెండ్లను కూడా మళ్లీ మదుపు చేస్తేనే అధిక రాబడులు. స్టాక్ మార్కెట్ ఉత్పన్న పతనాల్లో మనం ఎదుర్కొనే మానసిక ఒత్తిడిలు బంగారం పెట్టుబడిలో ఉండవు. 20 ఏండ్ల కన్నా ఎక్కువ సమయంలో షేర్లలోనే రాబడి కాస్త ఎక్కువ. ఇరవై ఏండ్లలో షేర్లలో పెట్టుబడులు ఏటా 15 శాతం రాబడిని ఇస్తే, బంగారం 12.6 శాతం రాబడిని ఇచ్చింది. కానీ, గత ఐదేండ్ల కాలంలో షేర్లు 14.2 శాతం రిటర్నులు పంచితే.. అదే పసిడి 14.4 శాతం రాబడిని ఇచ్చింది. బంగారం పెట్టుబడిలో భద్రత ఇచ్చే ఆనందం అదనం. షేర్లలో ఉండే రిస్క్, ఒత్తిడి బంగారంలో ఉండదు.
బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే బంగారమే కొనాలా? చాలా మందికి ఒకేసారి తులం బంగారం కొనే స్తోమత, ఆర్థిక వనరులు ఉండకపోవచ్చు. అలాగని గ్రాము లేదా గ్రాము కన్నా తక్కువ బంగారం నేరుగా కొనడానికి మనసొప్పదు. ఆభరణాల విక్రయ సంస్థలు వాయిదా స్కీములు పెట్టినా సరే నమ్మకం తక్కువ. మోసం జరిగే అవకాశమూ ఎక్కువే. అందుకే ఎలక్ట్రానిక్ రూపంలో గోల్డ్ ఈటీఎఫ్ల్లోను కొనవచ్చును. ఇవి స్టాక్ ఎక్సేంజీల్లో ట్రేడ్ అయినా స్టాక్స్ మాదిరిగా రిస్క్ కలిగి ఉండవు. ఈటీఎఫ్లు కూడా మ్యుచువల్ ఫండ్సే. కాకపోతే లిక్విడిటీకోసం ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. వీటిలో పెట్టుబడుల ద్వారా వచ్చిన సొమ్ములో 90 శాతం బంగారంలోనే మదుపు చేస్తారు. మిగతా 10 సొమ్మును ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల్లో పెడతారు. రిస్క్ చాలా తక్కువ. మార్కెట్లో బంగారం ధరల్లో ఉండే ఒడిదుడుకులు ఇందులో కూడా ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు బంగారం ధర బులియన్ మార్కెట్ ఒక శాతం తగ్గితే దాదాపు అంతే ఈటీఎఫ్ ధర కూడా పతనం అవుతుంది. అందుకని ప్రతి నెలా గోల్డ్ ఈటీఎఫ్లతో సిప్ రూపంలో మదుపు చేస్తే చాలు. తులం బంగారం విలువకు సమానంగా లేదా మీరు చేయించుకోవాలకునున్న ఆభరణానికి సమానంగా ఈటీఎఫ్ల విలువ ఉన్నప్పుడు వాటిని అమ్మి వచ్చిన నగదుతో నేరుగా ఆభరణాలనే కొనుగోలు చేయవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈటీఎఫ్లో పెట్టుబడుల వల్ల దొంగతనం జరిగే రిస్క్ గానీ, తరుగు నష్టం కానీ ఉండవు.
ఆగస్టు 2018 లో రూ. 29 వేలు పలికిన బంగారం ధర సరిగ్గా రెండేండ్లలో ఆగస్టు 2020 నాటికి రూ. 57 వేలకు చేరుకున్నది. అంటే దాదాపు రెట్టింపు అయింది. అప్పటి నుంచి 21 శాతం పైగా ఎనిమిది నెలల్లో పతనం అయింది. కరొనా భయాలు తగ్గిపోవడం, ఇతర మదుపు సాధనాలైన బాండ్లు, కరెన్సీ, ఈక్విటీల్లో పెరుగుతున్న రాబడులతో బంగారంలో లాభాల స్వీకరణ జరుగుతున్నది. దానికి తోడు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. అలాగే దిగుమతుల గుదిబండ భారాన్ని తగ్గించుకోవడానికి మన ప్రభుత్వం వేస్తున్న సుంకాల భారమూ బంగారం ధర తగ్గడానికి కారణాలు. అయితే ఇంకా ఎంత పతనం అనేదే ప్రశ్న. ప్రస్తుతానికి టెక్నికల్గా రూ. 42,800 నుంచి రూ. 39,500 మధ్య గట్టి మద్దతు ఉంది. ఈ స్థాయిలకు మించి పతనాన్ని ఇప్పడు అంచనా వేయలేం.