తిరుపతి,జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేపటి నుంచి 27వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము జరగనున్నాయి. శనివారం ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు. జూన్ 22న సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 27న ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్కు స్నపన తిరుమంజనం జరుగనుంది. అనంతరం ఉదయం 10 నుంచి 10.15 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.