న్యూఢిల్లీ: రైతుల ప్రసన్నం కోసం కొత్త కేంద్ర కేబినెట్ ప్రయత్నించి. వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీల (ఏపీఎంసీ) ద్వారా రైతులకు లక్ష కోట్ల నిధులు కేటాయించింది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతులు తమ ఆందోళనను తీవ్రం చేసేందుకు సిద్ధమయ్యారు. వర్షాకాల సమావేశాలు జరిగే అన్ని రోజులు పార్లమెంట్ వద్ద నిరసన తెలుపుతామని, తమ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు ప్రతిపక్షాలు సభ జరుగకుండా అడ్డుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇటీవల పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన కొత్త కేబినెట్ తొలి సమావేశంలోనే వ్యవసాయం రంగానికి రూ. లక్ష కోట్ల నిధులను ప్రకటించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్న ఆయన, ఇతర అవకాశాలు, సమస్యలపై రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నిరసన ముగించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలను బలోపేతం చేస్తామని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతు మౌలిక సదుపాయాల నిధికి ఆత్మనిర్భర్ భారత్ కింద కేటాయించిన రూ . లక్ష కోట్లు, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలు ఉపయోగించుకోవచ్చని వివరించారు. వ్యవసాయ చట్టాల అమలు తరువాత కేంద్ర మౌలికసదుపాయాల నిధుల నుంచి కోట్ల రూపాయలు మార్కెట్ కమిటీలకు అందుతాయని, వాటి బలోపేతంతోపాటు ఎక్కువ మంది రైతులకు ఈ నిధి ఉపయోగపడుతుందని వెల్లడించారు.