సూర్యాపేట, ఏప్రిల్ 12 : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరమయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకు వస్తే మద్దతు ధర లభిస్తున్నదన్నారు. గ్రామపంచాయతీల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని, పీహెచ్సీల్లో మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. ప్రజా వాణిలో 70 ఫిర్యాదులు రాగా 54 భూ సమస్యలపైనే వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుందరి కిరణ్కుమార్, ఐసీడీఎస్ పీడీ నర్సింహారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, వ్యవసాయ అధికారి రామారావునాయక్ పాల్గొన్నారు.
కొవిడ్ కట్టడికి చర్యలు
జిల్లాలో కొవిడ్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని వైద్యాధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, పని చేసే చోట, ప్రయాణాల్లో మాస్క్లు ధరించాలని, లేకపోతే విపత్తు నివారణ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని, రూ. వెయ్యి జరిమానా తప్పదని హెచ్చరించారు. 45 సంవత్సరాలు పైబడిన వారంతా వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టీకా అందుబాటులో ఉందని తెలిపారు.