న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 17: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్న అతి విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. అమెరికా రిజర్వుబ్యాంక్ వచ్చే రెండేండ్లలో వడ్డీరేట్లను పెంచబోతున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో అలజడి సృష్టించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీ 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.860 తగ్గి రూ.47 వేల దిగువకు పడిపోయింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి ధర రూ.46,860గా ఉన్నది. బుధవారం ఈ ధర రూ.47,720గా ఉన్నది. బంగారంతోపాటు వెండి కూడా చౌకైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు అంతంత మాత్రంగానే ఉండటంలో కిలో వెండి ఏకంగా రూ.1700 తగ్గి రూ.68,798గా ఉన్నది. అంతకుముందు ఈ ధర రూ.70 వేలుగా ఉన్నది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 దిగొచ్చి రూ.48,930 పలుకగా, 22 క్యారెట్ల ధర రూ.44,850 వద్దకు తగ్గాయి. కిలో వెండి రూ.1,100 దిగొచ్చి రూ.75,100 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,810 డాలర్లకు పడిపోగా, వెండి 26.98 డాలర్లకు దిగొచ్చింది. త్వరలో వడ్డీరేట్లు పెంచకతప్పదని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వ్యాఖ్యలు బులియన్ ధరలు ఒత్తిడికి గురవడానికి కారణమయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. దీంతో డాలర్కు అనూహ్యంగా మద్దతు లభించినట్లు అయింది.