న్యూఢిల్లీ, జూన్ 11:గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభంకావడంతో ధరలు అమాంతం పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో రూ.440 పెరిగిన తులం బంగారం ధర రూ.48,530 పలికింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.1,150 అధికమైంది. దీంతో ధర రూ.71,440గా నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.300 పెరిగి రూ.50,300 పలికింది. 22 క్యారెట్ల ధర కూడా అంతేస్థాయిలో పెరిగి రూ.46,100గా ఉన్నది. అలాగే కిలో వెండి రూ.1,200 ఎగబాకి రూ.77,300కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,898 డాలర్లు, వెండి 28.15 డాలర్లుగా ఉన్నది.