న్యూఢిల్లీ: గ్లోబల్ కార్పొరేట్ టాక్స్ కనీసం15 శాతం విధించాలన్న ప్రతిపాదనకు భారత్, చైనా, స్విట్జర్లాండ్తో సహా ప్రపంచంలోని 130 దేశాలు మద్దతు పలికాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సమావేశంలో అమెరికా ఆర్థిక మంత్రి జానెత్ అల్లెన్ ఈ ప్రకటన చేశారు. దీనివల్ల ప్రతిఏటా అదనపు 150 బిలియన్ల డాలర్ల పన్నులు ప్రపంచ దేశాలు పొందుతాయని అంచనా.
ఇంటర్నేషనల్ టాక్స్ రూల్స్లో సంస్కరణలు తేవాలన్న ప్రణాళికలో 130 దేశాలు చేరాయని ఓఈసీడీ ప్రకటించింది. దీని ప్రకారం బహుళ జాతి సంస్థలు (ఎంఎన్సీ)లు బిజినెస్ చేసిన దేశాల్లో సరైన కార్పొరేట్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఓఈసీడీలో సభ్యత్వం గల 130 దేశాలు గ్లోబల్ జీడీపీలో 90 శాతానికి పై చిలుకు. గ్లోబల్ కార్పొరేట్ టాక్స్ విధానంపై జీ-20 దేశాల కూటమి రూపొందించిన ముసాయిదాకు ఓఈసీడీలోని 130 దేశాలు ఆమోదముద్ర తెలిపాయి.
అక్టోబర్ నాటికి ఇంటర్నేషనల్ టాక్స్ రూల్ అమలులోకి వస్తుందని అంచనా. ఇంటర్నేషనల్ టాక్స్ సిస్టమ్లో స్థిరత్వం తేవడమే దీని లక్ష్యాల్లో ఒకటి.
గ్లోబల్ కార్పొరేట్ టాక్స్ విధానం రూపకల్పనలో రెండు అంశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా బిజినెస్ చేయడానికి సాధికారత కల్పిస్తుందీ సిస్టమ్. మల్టీ నేసనల్ కంపెనీలపై సరైన పన్ను విధించేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఆ కంపెనీ సొంత దేశం, ఆ కంపెనీ బిజినెస్ చేసే దేశం మధ్య పన్నులు వసూలు చేయడానికి కొన్ని హక్కులు కల్పిస్తాయి.