న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను రాజస్థాన్ లో చెత్త కింద పడేస్తున్నారనే వార్తలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అశోక్ గెహ్లోత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో వ్యాక్సిన్లను మొదట చెత్తడబ్బాల్లో విసిరివేశారని, ఇప్పుడు వాటిని పాతిపెడుతున్నారని ఆరోపిస్తూ ఓ వార్తా పత్రిక కథనాన్ని మంత్రి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ టూల్ కిట్ లో ఇది ఓ భాగమా అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రాజస్థాన్ లోని పలు జిల్లాల్లో వ్యాక్సిన్లను వ్యర్ధం చేస్తున్నారనే వార్తలను రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్ సింగ్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వ్యర్ధంపై కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు రాజస్ధాన్ లో వ్యాక్సిన్ల వ్యర్ధంపై దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.